హైదరాబాద్, నవంబర్ 11 ( నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ ఓటు కోసం 31,551 మంది దరఖాస్తు చేసుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం 80 ఏండ్లు పైబడిన వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు వేసే వెసులుబాటు కల్పించింది. 13 అత్యవసర సేవల ఉద్యోగులకూ పోస్టల్ ఓటు సౌకర్యం కల్పించారు. దీని కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 8 వరకు అధికారులు అవకాశం కల్పించారు. రాష్ట్రంలో దివ్యాంగులు 5.06 లక్షలు, 80 ఏండ్లు పైబడిన వారు 4.43 లక్షల మంది, వందేండ్లు పైబడిన వారు 7,689 మంది ఉన్నారు. పూర్తిస్థాయి అవగాహన లేకపోవడంతో చాలా తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని అంచనా వేస్తున్నారు.
పోస్టల్ ఓటుకోసం దరఖాస్తు చేసుకున్న వారికి పోలింగ్ తేదీకి ముందుగానే ఓటేసే అవకాశం కల్పిస్తారు. వారి ఓటింగ్ తేదీలను స్థానికంగా ఉండే రిటర్నింగ్ అధికారి నిర్ణయిస్తారు. రూట్ల వారీగా ఉండే పోలింగ్ అధికారుల బృందం ఓటింగ్ ప్రక్రియను చేపడతారు. ఈ ప్రక్రియను మొత్తం వీడియోలో చిత్రీకరిస్తారు. రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో ఓట్లను బ్యాలెట్ బాక్స్ల్లో ఉంచి, మొత్తం పోలింగ్ పూర్తయ్యాక స్ట్రాంగ్ రూంలో భద్రపరుస్తారు. ఓట్ల లెక్కింపు రోజున మొదట ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లనే లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎం ఓట్లను లెక్కిస్తారు.