ధన్వాడ/నారాయణపేట రూరల్, సెప్టెంబర్ 19: నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలోని మాడల్ స్కూల్ హాస్టల్లో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. శనివారం అల్పాహారం చేశాక 30 మంది విద్యార్థులు కడుపునొప్పితో బాధపడుతున్న విషయాన్ని సిబ్బందికి తెలిపారు. ప్రత్యేక అధికారి వైశాలి వెంటనే వారిని మండల కేంద్రంలోని దవాఖానకు తరలించారు. 18 మందికి చికిత్స అందించి పాఠశాల హాస్టల్కు పంపించేశారు.
మరో 12 మంది పరిస్థితి విషమంగా ఉండగా.. నారాయణపేట జిల్లా దవాఖానకు తరలించారు. పుడ్పాయిజన్ ఘటనపై కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో రమేశ్ విచారణ చేపట్టారు. ఘటనకు బాధ్యులైన వంట ఏజెన్సీ నిర్వాహకురాలు కావేరి, కేర్ టేకర్ (వార్డెన్)అనురాధను విధుల నుంచి తొలగిస్తున్నట్టు తెలిపారు. బూజు పట్టిన పల్లీలతో చట్నీ చేయడంతో తాము అస్వస్థతకు గురైనట్టు విద్యార్థినులు అధికారులకు వివరించారు.