ములుగు, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : తన కుమారుడి మృతికి కోతులను చంపేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే కారణమని ఆరోపిస్తూ ఓ తండ్రి సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు యత్నించిన ఘటన ములుగు జిల్లా గోవిందరావుపేటలో కలకలం సృష్టించింది. బాధితుడి సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గోవిందరావుపేటకు చెందిన ఇరుగు శ్రావణ్ కుమారుడు అశ్విత్నందన్ ఏప్రిల్ 12న తన ఇంటి ముందున్న అంగన్వాడీ సెంటర్కు వెళ్లాడు. సర్పంచ్, ఉప సర్పంచ్ కలిసి కోతులను చంపేందుకు బాలామృతంలో ఫెరడాన్ త్రీజీ అనే మందును కవర్లో పెట్టి ఉంచారు. అశ్విత్నందన్ దీనిని సత్తు పిండి అనుకొని తినడంతో మృతి చెందాడు.
తమకు న్యాయం చేయాలని శ్రావణ్ కుటుంబం ఆందోళన చేపట్టగా స్పందించిన మంత్రి సీతక్క మృతుడి తల్లికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చినా నేటికీ నెరవేరలేదు. తన కుమారుడి మృతికి ప్రభుత్వమే కారణమని, సర్పంచ్, ఉప సర్పంచ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్త్తూ శ్రావణ్ శుక్రవారం పురుగుల మందు తాగి.. తన ఆవేదనను సెల్ఫీ వీడియో తీయడంతో వైరల్గా మారింది. శ్రావణ్ను ములుగు ప్రభుత్వ దవాఖానలో చేర్చారు. శ్రావణ్ను బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి శనివారం పరామర్శించారు. శ్రావణ్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు రూ.5లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆమెను పోలీసులు అడ్డుకున్నారు.