హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) / చండూరు(గట్టుప్పల్) / నాంపల్లి / మర్రిగూడ: నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో బీజేపీకి మరో షాక్ తగిలింది. మర్రిగూడ మండల బీజేపీ అధ్యక్షుడు చెర్కు శ్రీరాంగౌడ్, ప్రధాన కార్యదర్శి, సరంపేట ఉప సర్పంచ్ జెల్లాకుల సైదులుయాదవ్, సరంపేట గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు మోటం మల్లయ్య, ఉగ్గం రామస్వామి, వట్టిపల్లి వార్డు సభ్యుడు ఉప్పు యాదయ్య, మాజీ సర్పంచ్ ఉప్పు బుచ్చప్ప సహా 30 మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేశారు. గట్టుప్పల్ ఎంపీటీసీ చెరుపల్లి భాస్కర్, నాంపల్లి మండలం మహ్మదాపురం కాంగ్రెస్ ఎంపీటీసీ మలిగిరెడ్డి శ్రీదేవి, మాజీ సర్పంచ్ తుమ్మలూరి దయాకర్రెడ్డి తదితరులు విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
శుక్రవారం వీరికి హైదరాబాద్లో గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో తెలంగాణ రాష్ర్టాన్ని మొదటి స్థానంలో నిలిపిన సీఎం కేసీఆర్పై పెరిగిన విశ్వసనీయతకు ఈ చేరికలు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసే ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వలసల ప్రవాహం కొనసాగుతున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో చేస్తున్న ప్రగతిని చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారని పేర్కొన్నారు. దేశాన్ని సంక్షేమ రాజ్యంగా మార్చడమే కేసీఆర్ లక్ష్యమని, అందుకే జాతీయ పార్టీని ప్రకటించబోతున్నట్టు తెలిపారు. కాగా, చౌటుప్పల్ మండలంలోని కుంట్లగూడెం గ్రామానికి చెందిన 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సమక్షంలో శుక్రవారం చౌటుప్పల్ మార్కెట్ యార్డులో జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్లో చేరారు.