యాదాద్రి భువనగిరి, జనవరి 17 (నమస్తే తెలంగాణ) : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని సీఎం కేసీఆర్ బుధవారం దర్శించుకోనున్నారు. ఆయనతోపాటు కేరళ సీఎం పినరాయి విజయన్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఆలయానికి రానున్నారు. ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభకు ముందు నలుగురు సీఎంలు యాదగిరిగుట్టలో దర్శనం చేసుకోనున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి యాదగిరిగుట్టకు రెండు హెలికాప్టర్లలో బయల్దేరి 11:30 గంటలకు గుట్టకు చేరుకుంటారు. సీఎంలకు స్వాగతం పలికేందుకు ఆలయ అధికారులు, అర్చకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. హెలిప్యాడ్ వద్ద ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గుట్టపైకి వెళ్తారు.
గుట్టపై అర్చకులు పూర్ణకుంభం అందించి స్వాగతం పలుకుతారు. నలుగురు సీఎంలు స్వయంభూ లక్ష్మీ నారసింహుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముఖ్యమంత్రులకు అర్చకులు వేదమంత్రోచ్చారణలతో ఆశీర్వచనం చేస్తారు. ముఖ్యమంత్రుల పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గుట్టలో 1600 మంది పోలీసు బలగాలను మోహరించారు. అనంతరం 12:30 గంటలకు గుట్ట నుంచి హెలికాప్టర్లో ఖమ్మం బహిరంగ సభకు వెళ్తారు. సీఎంల టూర్ నేపథ్యంలో.. భద్రతా కారణాల దృష్ట్యా బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు భక్తులకు దర్శనం, ఆర్జిత సేవలకు అనుమతి లేదని ఆలయ ఈవో తెలిపారు.