కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్ర వైద్యశాఖ సన్నద్ధంగా ఉన్నది. రెండు కోట్ల టెస్టింగ్ కిట్లు, కోటి హోం ఐసొలేషన్ కిట్లు అందుబాటులో ఉన్నాయి. అన్ని ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్ బెడ్లు, ఐసీయూ బెడ్లు, ఆక్సిజన్ ప్లాంట్లు సిద్ధం చేశాం.
–మంత్రి హరీశ్రావు
సంగారెడ్డి, జనవరి 4 (నమస్తే తెలంగాణ): కరోనా థర్డ్వేవ్ ప్రభావం నెలన్నరపాటు కొనసాగే అవకాశమున్నదని, ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఇదే విషయాన్ని చెప్పిందని వైద్యారోగ్యశాఖ మం త్రి హరీశ్రావు అన్నారు. ఒమిక్రాన్ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉన్నదని చెప్పారు. టెస్టింగ్ కిట్లు, ఐసోలేషన్ కిట్లు, మం దులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయని స్పష్టంచేశారు. మంగళవారం సంగారెడ్డి మెడికల్ కళాశాల పనులను మంత్రి పరిశీలించి, వైద్యాధికారులతో సమీక్షించారు. అనంతరం సంగారెడ్డి జిల్లా దవాఖానలో టీనేజర్లకు కరోనా వ్యాక్సినేషన్ను ప్రారంభించారు. తర్వాత దవాఖానలో ఆక్సిజన్ ప్లాంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వంద శాతం వ్యాక్సినేషన్కు చర్యలు చేపట్టా మన్నారు. రాష్ట్రంలో రెండు కోట్ల టెస్టింగ్ కిట్లు, కోటి హోంఐసొలేషన్ కిట్లు రెడీగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్ బెడ్లు, ఐసీయూ బెడ్లు, ఆక్సిజన్ ప్లాంట్లను సిద్ధంచేశామని చెప్పారు. తెలంగాణను వైద్యారోగ్య రంగంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నట్టు స్పష్టంచేశారు.
ప్రభుత్వ దవాఖానల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో ప్రజలు ప్రైవేటు దవాఖానలకు వెళ్లి ఆర్థిక ఇబ్బందులకు గురికావద్దని మంత్రి సూచించారు. సర్కారు దవాఖానల్లో ఎక్కడా వైద్యుల పోస్టులు ఖాళీగా లేవని.. ఎక్కడైనా ఖాళీలు ఉంటే డాక్టర్ను నియమించుకునే అధికారం కలెక్టర్లకు అప్పగించినట్టు వెల్లడించారు. సమైక్య పాలనలో తెలంగాణలో గాంధీ దవాఖానలోనే మాత్రమే సీటీ స్కానింగ్ మిషన్ ఉండేదని, ప్రస్తుతం రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని ప్రభుత్వ దవాఖానల్లో సీటీ స్కానింగ్ మిషన్లను ఏర్పాటుచేశామని స్పష్టంచేశారు. వందశాతం వ్యాక్సినేషన్ దిశగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని మార్చురీలను ఆధునీకరించడంతోపాటు ఫ్రీజర్లను అందజేయనున్నట్టు పేర్కొన్నారు. ఇందుకోసం రూ.25 కోట్ల నిధులు విడుదల చేసినట్టు తెలిపారు. బీపీ, షుగర్ ఉన్నవారికి ప్రభుత్వం ఉచితంగా మందులు అందజేస్తున్నదని.. ఇకనుంచి రెండు వేర్వేరు రంగుల కిట్లలో బీపీ, షుగర్ ట్యాబ్లెట్లను అందజేయాలని నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీలు భూపాల్రెడ్డి, నరోత్తంరెడ్డి, ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, భూపాల్రెడ్డి, మహిపాల్రెడ్డి, మాణిక్రావు, తూర్పు జయప్రకాశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.