హైదరాబాద్, అక్టోబర్6 (నమస్తే తెలంగాణ): కానిస్టేబుల్ ఫలితాల్లో ప్రభుత్వ స్టడీ సర్కిల్స్ సత్తా చాటాయి. ఎస్సీ, బీసీ సర్కిళ్లలో శిక్షణ పొందిన వందలాది మంది అభ్యర్థులు ఉద్యోగాలు దక్కించుకొన్నారు. రాష్ట్రంలోని 12 బీసీ స్టడీ సర్కిల్స్లో 862 మంది అభ్యర్థులు కానిస్టేబుల్ పరీక్షకు శిక్షణ పొందారు. ఇందులో 182 మంది అభ్యర్థులు (21%) కొలువులు సాధించినట్టు బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. విజయం సాధించిన అభ్యర్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చక్కటి పాఠ్యప్రణాళిక, నాణ్యమైన శిక్షణ, ప్రతీ అభ్యర్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, రెగ్యులర్గా పరీక్షలు నిర్వహించడం వల్ల ఈ విజయం సాధ్యమైందని తెలిపారు. హైదరాబాద్ స్టడీ సర్కిల్ నుంచి 9, ఆదిలాబాద్ 46, జోగులాంబ గద్వాల్ 21, కరీంనగర్ 8, ఖమ్మం 42, మహబూబ్ నగర్ 6, నల్గొండ 6, నిజామాబాదు 13, రాజన్న సిరిసిల్ల 8, సంగారెడ్డి 9, సిద్దిపేట 5, వరంగల్ నుంచి 9 మంది అభ్యర్థులు కానిస్టేబుల్ కొలువులు సాధించారని వివరించారు.
11 ఎస్సీ స్టడీసర్కిల్స్ నుంచి 234 మంది..
రాష్ట్రంలోని ఎస్సీ స్టడీ సర్కిల్స్ నుంచి 234 మంది అభ్యర్థులు కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందారు. ప్రభుత్వం జిల్లాకొకటి చొప్పున 33 ఎస్సీ స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసింది. వీటిల్లో 3,300 మందికిపైగా అభ్యర్థులు పోలీస్ కొలువులకు శిక్షణ పొందారు. ఇప్పటివరకు 11 ఎస్సీ స్టడీ సర్కిల్స్ నుంచి 234మంది అభ్యర్థులు కొలువులను సాధించినట్టు స్టడీ సర్కిల్ జేడీ శ్రీధర్ వెల్లడించారు. ఇంకా అన్ని స్టడీ సర్కిల్స్ను సంబంధించిన వివరాలు రావాల్సి ఉన్నదని పేర్కొన్నారు. ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
నాణ్యమైన కోచింగ్ వల్లే ఈ ఫలితాలు
గతంలో ఎన్నడూ లేనివిధంగా బీసీ స్టడీ సర్కిల్స్లో శిక్షణ పొందిన 182 మంది అభ్యర్థులు కానిస్టేబుల్ కొలువులు సాధించారు.నాణ్యమైన కోచింగ్ వల్లే మంచి ఫలితాలు సాధించాం. సీఎం కేసీఆర్ అందిస్తున్న ప్రోత్సాహం, కల్పిస్తున్న వనరుల ఫలితాల వల్లే ఇది సాధ్యమైంది. అందుకు సీఎం కేసీఆర్కు నా కృతజ్ఞతలు. ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
-గంగుల కమలాకర్, సంక్షేమశాఖ మంత్రి