హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 21 నామినేషన్లు చెల్లుబాటైనట్టు అధికారులు శుక్రవారం ప్రకటించారు. గురువారం నామినేషన్ల ఘట్టం ముగియగా, నామినేషన్ల పరిశీలనలో దాఖలు చేసివన్నీ చెల్లుబాటయ్యాయని పేర్కొన్నారు. 27 వరకు ఉపసంహరణ గడువు ఉన్నదని తెలిపారు.
బీజేపీ అభ్యర్థిగా ఏ వెంకట నారాయణరెడ్డి పోటీ చేస్తుండగా.. ప్రజావాణి పార్టీ తరపున ఎల్ వెంకటేశ్వర్లు బరిలో ఉన్నారు. ఇక 19 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు అయిలునేని సంతోశ్కుమార్, కే సాయన్న, కాటేపల్లి జనార్దన్రెడ్డి, కే ప్రభాకర్, డాక్టర్ డీ వెంకటేశ్వర్లు, జీ హర్షవర్థన్రెడ్డి, గుర్రం చెన్నకేశవరెడ్డి, సీ చంద్రశేఖర్, సీ పార్వతి, టీ అన్నత్ నారాయణ్, డీ మల్లారెడ్డి, డాక్టర్ వీ నాథనైల్, పాపన్నగిరి మానిక్రెడ్డి, బీ భుజంగరావు, ఎం తిరుపతి, లక్ష్మీ నారాయణ మారంపల్లి, ఎస్ విజయకుమార్, ఎ వినయ్బాబుల నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయని వెల్లడించారు.
ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. 9 జిల్లాల పరిధిలో 137 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ సామాగ్రిని సిద్ధంచేశారు. మార్చి 13న పోలింగ్ జరుగనున్నది. మార్చి 16న కౌంటింగ్, 21న ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని అధికారులు తెలిపారు. 9 జిల్లాల పరిధిలో 29,720 మంది ఓటర్లు ఉన్నారు. 9,186 మంది ఓటర్లతో రంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో ఉన్నది. రెండో స్థానంలో మేడ్చల్, అత్యల్పంగా 877 ఓటర్లతో జోగులాంబ గద్వాల్ నిలిచింది. నామినేషన్ల పర్వం ముగియడంతో అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు.