206 Kidney Stones | కడుపులో కాసింత నొప్పి వస్తేనే విలవిల్లాడిపోతాం.. అటువంటిది కిడ్నీలో ఒకటి కాదు రెండు కాదు 206 రాళ్లు ఉన్నాయి. అలా ఆరు నెలలుగా భరించలేని నొప్పితో వీరమల్ల రామలక్ష్మయ్య (56) బాధపడుతున్నారు. అవేర్ గ్లెనేజిల్ గ్లోబల్ హాస్పిటల్ వైద్యులు శస్త్రచికిత్సతో ఆ రాళ్లు తొలగించారు. నల్గొండకు చెందిన ఈ వీరమల్ల రామలక్ష్మయ్యకు కీ హోల్ సర్జరీతో వాటిని తొలగించారు వైద్యులు. సదరు రామలక్ష్మయ్య స్థానిక హెల్త్ ప్రాక్టీషనర్ వద్ద చికిత్సతో తాత్కాలిక ఉపశమనం పొందేవాడు. కానీ రోజువారీగా నొప్పి వస్తుండటంతో విధులు కూడా నిర్వర్తించలేకపోయేవాడు.
అవేర్ గ్లెనేజిల్ గ్లోబల్ హాస్పిటల్ వైద్యులు (యూరాలజిస్ట్) డాక్టర్ పూల నవీన్ కుమార్ సదరు రామలక్ష్మయ్యకు వైద్య పరీక్షలు చేశారు. ప్రారంభంలో ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా కిడ్నీలో ఎడమ వైపు చాలా రాళ్లు ఉన్నట్లు నిర్ధారించారు. సీటీ క్యూబ్ స్కాన్ ద్వారా మళ్లీ ధ్రువీకరించుకున్నారు. దీంతో రామలక్ష్మయ్యకు వైద్యులు కౌన్సెలింగ్ చేసి.. కీ హోల్ సర్జరీకి సన్నద్ధం చేశారు. గంట సేపు సర్జరీ చేసి ఆ రాళ్లన్నీ తొలగించామని చెప్పారు.
డాక్టర్ నవీన్ కుమార్కు డాక్టర్ వేణు మన్నే (యూరాలజిస్ట్), అనెస్థియోలజిస్ట్ డాక్టర్ మోహన్, ఇతర వైద్యులు, నర్సింగ్ స్టాప్ సహకరించారు. సర్జరీ చేశాక కోలుకున్న రామలక్ష్మయ్యను రెండో రోజే డిశ్చార్జి చేసినట్లు వైద్యులు తెలిపారు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల డీ హైడ్రేషన్ కేసులు పెరిగిపోతున్నాయని దవాఖాన వైద్యులు తెలిపారు. డీ హైడ్రేషన్ వల్లే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతున్నాయని చెప్పారు. డీ హైడ్రేట్ కాకుండా కొబ్బరి నీళ్లు, మంచినీరు ఎక్కువ తీసుకోవాలని సూచించారు.