హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ):ఇంటర్ వార్షిక పరీక్షలకు భారీ సంఖ్యలో విద్యార్థులు డుమ్మా కొడుతున్నారు. శుక్రవారం ఒక్కరోజే 20,259 (4%) మంది ఫస్టియర్ విద్యార్థులు ఇంగ్లిష్ పరీక్షకు గైర్హాజరయ్యారు. దీనికి మొత్తం 5,02,018 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉన్నది. కానీ, 4,81,759 మంది విద్యార్థులే పరీక్ష రాసినట్టు ఇంటర్ బోర్డు కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. జనగామ, నాగర్కర్నూల్, కామారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో పరీక్ష నిర్వహణ తీరును పర్యవేక్షించేందుకు పరిశీలకులను పంపించినట్టు పేర్కొన్నారు.