హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): పదిహేను వర్సిటీల్లో బోధనా పోస్టుల భర్తీకి ప్రభుత్వం రూపొందించిన ‘ది తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు’ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపిన నెల రోజుల్లోనే 2020 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ బిల్లుపై గవర్నర్ లేవనెత్తిన సందేహాలకు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, అధికారులు వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ బోర్డు ద్వారా స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా ప్రతిభావంతులను ఆచార్యులుగా నియమిస్తారు.
ఉన్నత విద్యామండలి చైర్మన్గా, విద్యాశాఖ కార్యదర్శి, ఆర్థికశాఖ కార్యదర్శి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ బోర్డులో సభ్యులుగా ఉంటారు. గతంలో వర్సిటీలు సొంతంగా పోస్టులను భర్తీ చేస్తుండటంతో అవినీతి, ఆశ్రిత పక్షపాతం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. అన్యాయం జరిగిందని అభ్యర్థులు కోర్టులను ఆశ్రయిస్తుండటంతో నియామక ప్రక్రియ జాప్యమవుతున్నది. నిబంధనల ప్రకారం ఒక్కో అభ్యర్థిని కనీసం అరగంట ఇంటర్వ్యూ చేయాల్సి ఉండటంతో ఎక్కువ సమయం పడుతున్నది. ఒక వర్సిటీలో నియామకమైన అభ్యర్థికి మరో వర్సిటీలో అవకాశం వస్తే.. ఈ ప్రక్రియంతా వృథాగా మారి మళ్లీ కొత్తగా నియామకాలు చేపట్టాల్సి వస్తున్నది. వీటన్నింటికీ చెక్ పెడుతూ యూజీసీ మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటుచేసింది.