రాజన్న సిరిసిల్ల, మార్చి 2 (నమస్తే తెలంగాణ): సిరిసిల్ల నేతన్నలకు నిధులు విడుదలైనా బకాయిల చెల్లించకపోవడంపై చేనేత జౌళి శాఖ కమిషనర్ ఫైర్ అయ్యారు. చేనేత బకాయిలు, ఇందిరా మహిళా శక్తి చీరల తయారీ సందిగ్ధంపై ఆదివారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘నేతన్నకు 200 కోట్ల బకాయిలు’ కథనానికి చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజరామయ్యర్ స్పందించారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో మాట్లాడి, వివరాలు సేకరించినట్టు తెలిసింది. మున్సిపల్ ఎన్నికలకు ముందే బకాయిలు చెల్లించాలని చెప్పినా.. ఎందుకు పెండింగ్ పెట్టారని సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం. బకాయిలతోపాటు ఇందిరమ్మ చీరల తయారీ బిల్లులను వెంట వెంటనే చెల్లించాలని ఆదేశించినట్టు తెలిసింది. కాగా బకాయిలను సిరిసిల్లకు చెందిన ఓ కాంగ్రెస్ నేత చెబితే నిలిపివేసినట్టు అధికారులు చెప్పగా, వారిపై ఆమె అసహనం వ్యక్తంచేసినట్టు సమాచారం. చీరల తయారీ సజావుగా నిర్వహించాలని సూచించినట్టు తెలిసింది.
ఉర్దూపై విద్యాకమిషన్ చిన్నచూపు ; మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకుబ్పాషా
హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి నేతృత్వంలోని తెలంగాణ విద్యాకమిషన్ రాష్ట్ర ద్వితీయ అధికార భాషగా చలామణి అవుతున్న ఉర్దూపై చిన్నచూపు చూసిందని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకుబ్పాషా ఆక్షేపించారు. ఉర్దూ స్కూళ్లు, మదర్సాలను విస్మరించడం దురదృష్టకరమని సోమవారం ప్రకటనలో విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,221 ప్రైమరీ, 240 ఉన్నత ఉర్దూమీడియం పాఠశాలల అభివృద్ధి గురించి పట్టించుకోకపోవడం శోచనీయమని వాపోయారు. విద్యార్థులు లేరనే సాకుతో ఉర్దూ స్కూళ్లను ఇంగ్లిష్ మీడియం స్కూళ్లుగా మార్చుతున్నారని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన సుధీర్ కమిషన్ మదర్సాబోర్డు ఏర్పాటు చేయాలని, అరబిక్, ఉర్దూలతో పాటు ఆంగ్లాన్ని బోధించాలని నొక్కిచెప్పిందని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత తెలంగాణ విద్యాకమిషన్ విస్మరించడం ఎంతవరకు సమంజసనమని ప్రశ్నించారు. ప్రభుత్వం ఈ విషయాలను పరిగణనలోకి తీసుకొని ఉర్దూ మీడియం స్కూళ్లు, మదర్సాలను కాపాడాలని విజ్ఞప్తిచేశారు.