హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కొత్తగా మరో 20 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు( కేజీబీవీ) మంజూరయ్యాయి. ఈ మేరకు మంగళవారం విద్యాశాఖ జీవో 24ను విడుదల చేసింది. వీటి నిర్వహణకు రికరింగ్ బడ్జెట్గా రూ.60 లక్షలను కూడా మంజూరు చేసింది. అణగారిన వర్గాలకు చెందిన బాలికలను అక్కున చేర్చుకొని.. చక్కటి చదువులందిస్తున్న కేజీబీవీలను ఆయా కొత్త మండలాల్లో ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలకు ప్రభుత్వ ఆమోదం లభించింది. రాష్ట్ర ఆవిర్భావం సమయంలో 2014లో 391 కేజీబీవీలుండేవి. 2017-18లో మరో 84 కేజీబీవీలను మంజూరుచేశారు. తాజాగా 20 కేజీబీవీలు ఏర్పాటు చేయగా, వాటి సంఖ్య 495కి చేరింది. 245 కేజీబీవీల్లో ఇంటర్ విద్య, మరో 230 కేజీబీవీల్లో పదో తరగతి వరకు నిర్వహిస్తున్నారు.
కొత్తగా ఏర్పాటు చేసినవి ఇవే..
మావల (ఆదిలాబాద్), బీర్పూర్, బుగ్గారం (జగిత్యాల), కొత్తపల్లి, గన్నేరువరం (కరీంనగర్), దంతాలపల్లి (మహబూబాబాద్), మహ్మదాబాద్ (మహబూబ్నగర్), నార్సింగి, నిజాంపేట, హవేలి ఘన్పూర్ (మెదక్), నిజామాబాద్ (సౌత్), నిజామాబాద్ (నార్త్), నాగలిగిద్ద, మెగ్గుంపల్లి, వట్పల్లి, గుమ్మడిదల, చౌటకూరు (సంగారెడ్డి), దూల్మిట్ట (సిద్దిపేట), చౌడాపూర్ (వికారాబాద్)లలో కొత్తగా కేజీబీవీలను ఏర్పాటు చేశారు.