KGBV | హైదరాబాద్ : అణగారిన వర్గాలకు చెందిన బాలికలను అక్కున చేర్చుకుని.. చక్కటి చదువులందించే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ)లు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఏర్పాటవుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్తగా మరో 20 కేజీబీవీలు మంజూరయ్యాయి. వీటిని ఏర్పాటు చేస్తూ విద్యాశాఖ మంగళవారం జీవో నెంబర్-24ను విడుదల చేసింది. వీటిని ఏర్పాటుకు గాను రికరింగ్ బడ్జెట్గా రూ. 60 లక్షలను సైతం మంజూరుచేసింది. జిల్లాల విభజనతో రాష్ట్ర ప్రభుత్వం పలు మండలాలను విభజించి కొత్త మండలాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆయా కొత్త మండలాల్లో కేజీబీవీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇలా 20 కేజీబీవీలను నెలకొల్పాల్సి ఉండగా.. వాటి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలను రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఆ ప్రతిపాదనలకు ఆమోదం లభించడంతో కొత్తగా 20 కేజీబీవీల ఏర్పాటుకు ఉత్తర్వులు వెలువడ్డాయి.
రాష్ట్ర ఆవిర్భావ సమయంలో 2014లో రాష్ట్రంలో కేవలం 391 కేజీబీవీలు ఉండేవి. 2017-18లో కొత్తగా 84 కేజీబీవీలను మంజూరుచేశారు. దీంతో రాష్ట్రంలో కేజీబీవీల సంఖ్య 475కి చేరింది. తాజాగా మరో 20 కేజీబీవీలు మంజూరు చేయడంతో వీటి సంఖ్య 495కు చేరింది. వీటిల్లో 245 కేజీబీవీల్లో ఇంటర్, మరో 230 కేజీబీవీలను పదో తరగతి వరకు నిర్వహిస్తున్నారు.
మావల (ఆదిలాబాద్), బీర్పూర్, బుగ్గారం (జగిత్యాల), కొత్తపల్లి, గన్నేరువరం (కరీంనగర్), దంతాలపల్లి (మహబూబాబాద్), మహ్మదాబాద్ (మహబూబ్నగర్), నార్సింగి, నిజాంపేట, హవేలి ఘన్పూర్ (మెదక్), నిజామాబాద్ (సౌత్), నిజామాబాద్ (నార్త్), నాగలిగిద్ద, మెగ్గుంపల్లి, వట్పల్లి, గుమ్మడిదల, చౌటకూరు (సంగారెడ్డి), దూల్మిట్ట (సిద్దిపేట), చౌడాపూర్ (వికారాబాద్).