హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): మహిళలు సొంత గ్రామంలోనే ఉంటూ నెలకు సగటున రూ.20 వేల నుంచి రూ.60 వేల వరకు సంపాదించడం చిన్న విషయమేమీ కాదు. రెండు రకాలుగా ఉపయోగపడుతున్న బ్యాంక్ కస్టమర్ సర్వీసు పాయింట్లు విలేజ్ లెవల్ ఎంటర్ప్రెన్యూర్ (వీఎల్ఈ) లకు మంచి ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థికంగా అండగా నిలవడమే కాకుండా గ్రామీణ ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందుతున్నాయి. రైతుబంధు, ధాన్యం కొనుగోళ్లు తదితర రూపాల్లో తమ ఖాతాల్లో జమ అయిన నిధులను రైతులు ఈ పాయింట్ల ద్వారా డ్రా చేసుకోవడంతో వాటిని నిర్వహించే మహిళలకు కమీషన్ వస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్ చివరి నాటికి వీఎల్ఈల ద్వారా రూ.6 వేల కోట్ల లావాదేవీలు జరిగాయి. తమ శాఖలు లేని గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను ఖాతాదారులకు మరింత చేరువ చేయడానికి వివిధ బ్యాంకులు కస్టమర్ సర్వీసు పాయింట్ పేరుతో బిజినెస్ కరస్పాడెంట్లను నియమించుకుంటున్నాయి. వీరిని వీఎల్ఈగా పరిగణిస్తున్నారు. స్త్రీనిధి ద్వారా 964 గ్రామాల్లో వీఎల్ఈలను నియమించారు. వీటిలో ఎస్బీఐ 745 గ్రామాల్లో, యూబీఐ 219 గ్రామాల్లో కస్టమర్ సర్వీసు పాయింట్లను ఏర్పాటుచేశాయి.
మహిళలకు స్త్రీనిధి ప్రోత్సాహం
ఇంటర్మీడియట్ చదివిన మహిళా స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులను వీఎల్ఈలుగా నియమిస్తున్నారు. వీరికి బ్యాంకుల తరహాలోనే డబ్బులు డిపాజిట్ చేయడం, డ్రా చేయడం, పాస్బుక్ ప్రింట్ తీయడం, ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్కు డబ్బులు బదిలీ చేయడం, రుణాల చెల్లింపులు తదితర అంశాల్లో శిక్షణ ఇస్తారు. వినియోగదారులు ఆయా లావాదేవీలు నిర్వహించినప్పుడల్లా వీరికి కమీషన్ వస్తున్నది. ఇలా ఒక్కో వీఎల్ఈ నెలకు సగటున రూ.20 వేల నుంచి రూ.60 వేల వరకు సంపాదిస్తున్నారు. అత్యధిక లావాదేవీలు చేసిన వారిని స్త్రీనిధి సంస్థ అవార్డులతో సత్కరించి ప్రోత్సహిస్తున్నది. ఇటీవల ఫోన్ పే, గుగూల్ పే లాంటివి రావడంతో వీరి దగ్గరికి వచ్చే వారి సంఖ్య కొంతమేర తగ్గుతున్నది.
నెలకు రూ.కోటి లావాదేవీలు చేస్తున్నా
2008లో డ్వాక్రా గ్రూపులో చేరాను. తెలంగాణ ఏర్పడే వరకు వ్యవసాయ పనులకు వెళ్లాను. ఆ తరువాత స్త్రీనిధి అధికారులు ఎస్బీఐ కస్టమర్ సర్వీస్ పాయింటు ఏర్పాటు చేయించారు. మొదటి మూడేండ్లు నెలకు రూ.2,500 వరకు సంపాదించాను. క్రమంగా ఆదాయం పెరిగింది. ఒక్కొక్కసారి నెలకు రూ.60 వేలకు పైగా వచ్చింది. ఫోన్ పే, గూగుల్ పేతో ఆదాయం తగ్గింది. ప్రస్తుతం నెలకు రూ.20-25 వేల వరకు వస్తున్నాయి. నెలకు దాదాపు కోటి రూపాయలకు పైగా లావాదేవీలు చేస్తున్నాను. ఇంటి పని, వ్యవసాయం చేసుకునే నేను ఇంత పెద్ద మొత్తంలో లావాదేవీలు చేస్తుండటం నాకే ఆశ్చర్యంగా ఉన్నది. ఇది నాకు చాలా గర్వంగా, సంతోషంగా ఉన్నది.
– బద్దం శ్రీలత, ఆస్త గ్రామం, నిర్మల్ జిల్లా