(హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వరంగ సంస్థ అనే నమ్మకం, ఆర్థికంగా అండగా ఉండాలనే సదుద్దేశంతో బీహెచ్ఈఎల్కు 4 వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రం (వైటీపీపీ) నిర్మాణ బాధ్యత అప్పగిస్తే, పనుల్లో తీవ్ర జాప్యం చేస్తున్నదని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. పనులు ఆలస్యమైనకొద్దీ ఇటు జెన్కోకు, అటు బీహెచ్ఈఎల్కు ఆర్థిక భారం, నష్టం తప్పదని తెలిపారు. యాదాద్రి, భద్రాద్రి, కొత్తగూడెం థర్మల్ విద్యుత్తు కేంద్రాల నిర్మాణ పనులపై బీహెచ్ఈఎల్ ఉన్నతాధికారులతో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. 36 నెలల్లోనే 800 మెగావాట్ల సామర్థ్యంగల రెండు యూనిట్లు ప్రారంభిస్తామని హామీ ఇచ్చిన బీహెచ్ఈఎల్, ఐదేండ్లు గడుస్తున్నా పనులు పూర్తిచేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
విద్యుత్తు కేంద్ర నిర్మాణ కాంట్రాక్టు బీహెచ్ఈఎల్కు అప్పగించటంపై ప్రతిపక్ష ఎంపీలు కేంద్రానికి ఫిర్యాదులు చేస్తున్నారని తెలిపారు. పనుల పూర్తిపై ఇప్పటికే మూడు నాలుగుసార్లు షెడ్యూల్ మార్చారని, ఇప్పటికీ పనుల్లో వేగం పెంచకపోతే ఎలా అని బీహెచ్ఈఎల్ అధికారులను నిలదీశారు. నిర్దేశిత సమయానికి పనులు పూర్తిచేసి ఉంటే రాష్ట్ర అవసరాలకు ఎంతో ఉపయోగపడేదని అన్నారు. సమీక్షలో చర్చించిన అంశాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని, అవసరమైతే బీహెచ్ఈఎల్ సీఎండీతోనూ సీఎం మాట్లాడుతారని తెలిపారు.
త్వరలో భద్రాద్రి, కొత్తగూడెం పనులు పూర్తి
భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్)లో కొన్ని పనులు ఇంకా మిగిలి ఉన్నాయని జెన్కో అధికారులు తెలిపారు. మూడో యూనిట్లోని బాయిలర్ వద్ద కొన్ని పనులు చేయాల్సి ఉన్నదని, నాలుగో యూనిట్లో సీడీ బే కనెక్టింగ్ స్ట్రక్చర్, కోల్ పైపింగ్ సపోర్టింగ్లో మిగిలిపోయిన పనులను చేయాల్సి ఉన్నదని చెప్పారు. కొత్తగూడెంలోని కేటీపీఎస్ 800 మెగావాట్ల ఏడో స్టేజ్ ప్లాంట్ వద్ద టర్బైన్ వైబ్రేషన్ ఎక్కువగా ఉన్నదని, దీనిని వెంటనే సరిచేయాలని బీహెచ్ఈఎల్ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఆ పనులను వెంటనే పూర్తిచేస్తామని బీహెచ్ఈఎల్ అధికారులు హామీ ఇచ్చారు. సమీక్షలో జెన్కో డైరెక్టర్లు సచ్చిదానందం, అజయ్, టీఆర్కే రావు, వెంకట్రాజం, యాదాద్రి సీఈ సమ్మయ్య, శ్రీనివాస్, ఈగ హనుమాన్, బీహెచ్ఈఎల్ డైరెక్టర్ (పవర్) ఆర్ఎస్ మతారు, ఈడీలు మురళి, షకీల్ మనోచ, కొప్పికర్, శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు.
2023 జూన్ నాటికి రెండు యూనిట్లు
వచ్చే ఏడాది జూన్ (2023) నాటికి వైటీపీపీలో 1, 2 యూనిట్ల సీవోడీ పూర్తి చేస్తామని బీహెచ్ఈఎల్ అధికారులు హామీ ఇచ్చారు. అదే సమయానికి మూడో యూనిట్ సింక్రనైజేషన్ కూడా పూర్తి చేస్తామని తెలిపారు. ఇదే తుది గడువు అని, ఇకపై పొడిగింపు ఉండదని జెన్కో అధికారులు స్పష్టంచేశారు. కొన్ని రకాల మెటీరియల్ రాక ఆలస్యం కావటం, కార్మికుల సంఖ్య సరిపడినంత లేకపోవటమే పనులు మందగించటానికి కారణమని జెన్కో అధికారులు తెలిపారు. వైటీపీపీ పనుల్లో ప్రస్తుతం 6,500 మందే పనిచేస్తున్నారని, మరో 4-6 వేల మంది కార్మికులను నియమిస్తే పనుల్లో వేగం పెరుగుతుందని చెప్పారు. అయితే, క్షేత్రస్థాయిలో కొన్ని సమస్యలు ఉన్నాయని బీహెచ్ఈఎల్ డైరెక్టర్ (పవర్) ఆర్ఎస్ మథర్ తెలిపారు. వాటి పరిష్కారానికి జెన్కో సహకారం మరింత అవసరమని కోరారు.