హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని సర్కారు బడుల్లో విద్యార్థుల ఆకలి తీర్చేందుకు ప్రవేశపెట్టిన ‘సీఎం బ్రేక్ఫాస్ట్’ స్కీంపై పాఠశాల విద్యాశాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నది. బ్రేక్ఫాస్ట్ యూనిట్ వ్యయాన్ని రూ.8 నుంచి రూ.10.50గా ఖరారు చేసింది. ఒకరోజు అల్పాహారాన్ని అందించేందుకు ఒక్కో విద్యార్థిపై ఈ మొత్తాన్ని వెచ్చిస్తారు. ఇది మధ్యాహ్న భోజనం కంటే అధికం కావడం విశేషం. అదేవిధంగా, వంట కార్మికుల రెమ్యూనరేషన్ కూడా విద్యాశాఖ ఖరారు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి నెలకు రూ.2వేలు, పట్టణ ప్రాంతాల్లోని వారికి నెలకు రూ.వెయ్యి పారితోషికాన్ని అందజేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. బ్రేక్ఫాస్ట్ తయారీ బాధ్యతలను మధ్యాహ్న భోజనం వంట కార్మికులు లేదంటే ఇతరాత్ర ఔత్సాహికులకు అప్పగిస్తారు. మధ్యాహ్న భోజన కార్మికులకు ఇప్పటి వరకు నెలకు రూ.3వేలు పారితోషికంగా అందిస్తుండగా, బ్రేక్ఫాస్ట్ తయారుచేసేందుకు వారు ముందుకొస్తే మొత్తం కలుపుకొంటే రెమ్యూనరేషన్ రూ. 5వేలకు చేరుతుంది. పట్టణ ప్రాంతాల్లో మన్నా ట్రస్ట్, అక్షయపాత్ర సంస్థలు బ్రేక్ఫాస్ట్ను సిద్ధం చేసి, బడులకు చేరవేస్తాయి. ఈ బ్రేక్ఫాస్ట్ను వడ్డించేందుకు ఒక వ్యక్తిని నియమించుకోవాల్సి ఉండగా, ఆయా వ్యక్తికి నెలకు వెయ్యి రూపాయలు చెల్లించనున్నారు.
రాష్ట్రమంతటా అమలుకు కసరత్తు
రాష్ట్రమంతటా సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీంను అమలు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే 119 సర్కారు బడుల్లో ఈ పథకం పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైంది. ఇప్పటికే పథకం అమలుపై విశేష స్పందన లభిస్తున్నది. విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నందున విద్యార్థులు డుమ్మాలు తగ్గించి.. ప్రతిరోజూ తరగతులకు హాజరవుతున్న విషయం తెలిసిందే.