హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ పరిసరాల్లో సోమవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముందని, మంగళవారం నాటికి అది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని చెప్పింది. అనంతరం పశ్చిమ-వాయవ్య దిశగా కదిలి 29 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుందని వివరించింది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా సిద్దిపేట జిల్లా సింగారంలో 60 మి.మీ., ములుగు జిల్లా మేడారంలో 54 మి.మీ, నల్లగొండ జిల్లా తెల్దేవరపల్లిలో 43 మి.మీ, నాగర్కర్నూల్ జిల్లా వంకేశ్వర్లో 28 మి.మీ, వరంగల్ జిల్లా నల్లబెల్లిలో 27 మి.మీ, మేడిపల్లి, పాలకుర్తిలో 23 మి.మీ వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది.