కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని చండ్రుగొండ మండలం తిప్పనపల్లి వద్ద కూలీలతో వెళ్తున్న అశోక్ లెలాండ్ మినీ వ్యాన్ను ఓ బొగ్గు లారీ ఢీకొట్టింది. అప్పటికీ ఆగని లారీ అదుపుతప్పిన బోల్తాపడింది. ఈ ప్రమాదంలో మినీ వ్యాన్లో ప్రయాణిస్తున్న ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను 108 అంబులెన్సులో కొత్తగూడెం దవాఖానకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ మరొకరు మరణించారని అధికారులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.