హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీలను మంజూరుచేసింది. మహబూబాబాద్(మానుకోట)తోపాటు ఖమ్మం జిల్లా పాలేరులో వీటిని ఏర్పాటుచేయనున్నది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో జారీచేశారు. రెండుచోట్ల 5 కోర్సులకు అనుమతి ఇచ్చారు. 2023-24 విద్యాసంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించాలని ఆదేశించారు.
ఎంసెట్ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్లో వీటిల్లో సీట్లను భర్తీ చేస్తారు. వనపర్తి, సిరిసిల్ల, మానుకోట, పాలేరు కాలేజీలను కలుపుకొంటే జేఎన్టీయూ కళాశాలల సంఖ్య ఏడుకు చేరింది. గతంలో మహబూబాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించినప్పుడు మానుకోటకు ఇంజినీరింగ్ కాలేజీ మంజూరుచేస్తామని హామీ ఇచ్చారు. ఇంజినీరింగ్ కాలేజీ మంజూరుతో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేరినట్టయింది.