హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): యూకేలో ఉద్యోగాలిప్పిస్తామంటూ నమ్మించి తమను రూ.2.2 కోట్లు మోసం చేశారంటూ ఒక నిర్వాహకుడు సీసీఎస్లో ఫిర్యాదు చేయడంతో రెండు కంపెనీలపై కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. సికింద్రాబాద్లోని ‘రయ్ సెవెన్ ఎడ్యుకేషన్ సర్వీసెస్’ నిర్వాహకుడు సురేశ్కు గచ్చిబౌలిలోని వీవీసాప్ట్ టెక్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వాహకులు వివేక్ ఇరుకుల్ల, డైరెక్టర్ సునీత ముక్కలు పరిచయం అయ్యారు. తమ సంస్థ తరఫున యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లో నర్సింగ్ హోమ్లో కేర్ అసిస్టెంట్ ఉద్యోగాలిప్పిస్తామని, అన్ని వ్యవహారాలు తాబు చూసుకుంటామని సురేశ్కు చెప్పారు. సురేశ్ తన వద్ద ఉన్న 34 మంది అభ్యర్థుల వివరాలు, ఒక్కొక్కరికి రూ.8 లక్షల చొప్పున వివేక్కు డబ్బు పంపించాడు. అయితే, వివేక్ ఫోర్జరీ డాక్యుమెంట్లతో అభ్యర్థుల వీసాకు ఐప్లె చేశాడు. అందులో 22 మంది దరఖాస్తులను యూకే ప్రభుత్వం తిరస్కరించి, ఆ అభ్యర్థులు పదేండ్ల పాటు యూ కేలోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది. స్పాన్సర్షిప్ నుంచి అన్ని పత్రాలు ఫోర్జరీ చేసి, వీసా కోసం వివేక్ ప్రయత్నించడంతోనే భారీ నష్టం జరిగిందని సురేశ్ గుర్తించాడు. విద్యార్థుల నుంచి వసూలు చేసిన డబ్బులో రూ.2.2 కోట్లు తిరిగి ఇవ్వాలంటూ వివేక్ను డిమాండ్ చేయడంతో కాలయాపన చేస్తూ ఏకంగా బిచాణా ఎత్తేశాడు. దీంతో బాధితుడు సురేశ్ సీసీఎస్లో ఫిర్యాదు చేశాడు. వివేక్, బాలకృష్ణ కంపెనీలపై కేసు నమోదు చేసుకొని సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.