పెబ్బేరు, ఆగస్టు 24 : వనపర్తి జిల్లా పెబ్బేరులో రూ.18 కోట్ల విలువైన సీఎంఆర్ మాయమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని సాయి గణేశ్ రైస్ మిల్లులో సోమవారం విజిలెన్స్, పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రూ.18,35,83,057 విలువైన సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టినట్టు తేలింది. 2022-23 ఏడాది యాసంగికి సంబంధించిన 4,946.080 టన్నుల ధాన్యం కనిపించకుండా పోయినట్టు తనిఖీల్లో వెలుగు చూసినట్టు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఆంజనేయులు తెలిపారు. ఇటీవల పట్టణంలోని రెండు మిల్లుల్లో పెద్ద ఎత్తున ధాన్యం మాయమైనట్టు తేలింది. సాయిగోపాల ఇండోటెక్ మిల్లులో రూ.15 కోట్ల ధాన్యం, సత్యసాయి మిల్లులో రూ.24.9 కోట్ల ధాన్యం కన్పించకుండా పోయింది. అలాగే శ్రీరంగాపురంలోని ఆల్ అజీజ్ రైస్ మిల్లులోనూ రూ.31 కోట్ల ధాన్యాన్ని యజమాని పక్కదారి పట్టించినట్టు బయటపడింది. ఈ మిల్లులపై పోలీసులు కేసు నమోదు చేశారు.