హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ పార్సిల్ అండ్ కార్గో విభాగం ప్రారంభమైన నాటి నుంచి ఏటేటా గణనీయమైన వృద్ధి నమోదు చేస్తున్నది. పెరుగుతున్న రెవెన్యూతో సంస్థకు ఆర్థికంగా తనవంతు సహకారాన్ని అందిస్తున్నది. సేవలు ప్రారంభించిన రెండున్నరేండ్లలో కార్గో అండ్ పార్సిల్ విభాగం మొత్తంగా 1.6 కోట్ల పార్సిళ్లు చేరవేసి రూ. 170 కోట్లు ఆర్జించినట్టు అధికారులు తెలిపారు. తొలిసారి కరోనా సంక్షోభం తలెత్తి లాక్డౌన్ ముగిసిన అనంతరం 2020 జూన్లో ఆర్టీసీ కార్గో, పార్సిల్ సర్వీసులను ప్రారంభించింది. అప్పటి నుంచి ఈ సేవలను విస్తరిస్తూ వచ్చింది.
కార్యకలాపాలు ప్రారంభించిన ఆరు నెలల వ్యవధిలోనే రూ.22.86 కోట్లను కార్గో, పార్సిల్ ద్వారా ఆర్జించింది. 2021లో ఈ ఆదాయం ఏకంగా మూడు రెట్లు పెరిగి రూ.61.17 కోట్లకు ఎగబాకింది. 2022 ఏడాదిలో మరో 25 శాతం వృద్ధి చెంది ఆదాయం రూ.86.10 కోట్లకు చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మేజర్ బస్ స్టేషన్లలో 177 చోట్ల కార్గో, పార్సిల్ కేంద్రాలను నిర్వహిస్తున్నారు.
పార్సిల్ సర్వీసుల రిసీవింగ్, డెలివరీకిగాను 443మంది ప్రైవేట్ ఏజెంట్లను నియమించారు. పెద్ద మొత్తంలో సరుకు రవాణా (బల్క్ గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్) కోసం 193 కార్గో ట్రాన్స్పోర్ట్ వాహనాలను నడుపుతున్నారు. 2022లో మేడారం జాతర సందర్భంగా 5,258 బంగారం పార్సిళ్లను రవాణా చేశారు. 2022 ఏప్రిల్లో శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరిగిన రాముల వారి కల్యాణానికి సంబంధించిన 88,658 తలంబ్రాల పార్సిళ్లను ఆర్టీసీ కార్గో విజయవంతంగా చేరవేసింది. వీటితోపాటు బాగా ప్రాచుర్యం పొందిన జగిత్యాల బంగినపల్లి మామిడి పండ్లను ఆర్డర్ చేసిన వారి ఇంటి వద్దకే ఆర్టీసీ కార్గో విభాగం సరఫరా చేసి.. ప్రజల్లోకి వెళ్లగలిగిందని అధికారులు చెప్తున్నారు.