హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు సాధించిన 19 పట్టణాలకు ప్రోత్సాహకంగా రూ.38 కోట్లను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. గతంలోనే ఒక్కో మున్సిపాలిటీకి రూ.2 కోట్ల చొప్పున మున్సిపల్శాఖ మంత్రి కే తారక రామారావు ప్రకటించారు. మంత్రి ఆదేశాలతో మున్సిపల్ అధికారులు రెండు కోట్ల రూపాయల చొప్పున విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ నిధులను మున్సిపాలిటీల అభివృద్ధికి వెచ్చించనున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా రాష్ట్రానికి స్వచ్ఛ సర్వేక్షణ్ విభాగంలో 16 అవార్డులతో పాటు ఇండియన్ స్వచ్ఛత లీగ్ (ఐఎస్ఎల్) విభాగంలో మరో మూడు అవార్డులను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రదానం చేసింది. ఈ మున్సిపాలిటీలకు ప్రోత్సాహకంగానే ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. వీటితోపాటు జనాభా ప్రాతిపదికన గురువారం కేంద్రం విడుదల చేసిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో రాష్ర్టానికి ఏడు దక్కాయి. వీటికి కూడా త్వరలోనే ప్రోత్సాహక నిధులు విడుదల కానున్నాయి. ఇప్పటివరకు మొత్తంగా 26 మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలు స్వచ్ఛ సర్వేక్షణ్-2022 అవార్డులు దకించుకొన్నాయి. దేశంలో మరే రాష్ర్టానికి ఈ ఘనత దక్కలేదంటూ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మున్సిపల్ సిబ్బందిని అభినందిస్తూ ట్వీట్ చేశారు.
సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచి పురుడుపోసుకొన్న పట్టణ ప్రగతి, పల్లె ప్రగతితో తెలంగాణ పల్లెలు, పట్టణాల రూపురేఖలు మారి ప్రగతిపథంలో పయనిస్తున్నాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా చేపట్టిన పాలనా సంసరణలు, అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగానే జాతీయస్థాయిలో తెలంగాణకు అవార్డులు దకుతున్నాయి.
రాష్ట్రంలోని పట్టణాలు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో సత్తా చాటుతున్నాయి. తక్కువ పట్టణాలు ఉన్న రాష్ట్రాల్లో ఎక్కువ అవార్డులతో తెలంగాణ సత్తా ప్రదర్శించి అభివృద్ధిని దేశానికి చాటిచెప్పింది. ఈ అవార్డుల కోసం కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ జాతీయస్థాయి శానిటేషన్ సర్వేను జూలై 2021 నుంచి జనవరి 2022 వరకు నిర్వహించింది. పారిశుద్ధ్యం, మున్సిపల్ ఘనవ్యర్థాల నిర్వహణ, అవగాహనపై దేశవ్యాప్తంగా 4,355 పట్టణ స్థానిక సంస్థల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే నిర్వహించారు. అవార్డులకు ఎంపిక చేయడానికి 90 అంశాలను ప్రాతిపదికన తీసుకొన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిట్టర్ ఫ్రీ వాణిజ్య ప్రాంతాలు, కమ్యూనిటీ లెవల్ కంపోస్టింగ్, ప్రజా మరుగుదొడ్లు, కమ్యూనిటీ టాయిలెట్ల నిర్వహణ, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ప్రజల అవగాహన, సిటిజన్ ఎంగేజ్మెంట్, ఇన్నొవేషన్స్లో సర్వే నిర్వహించారు.