కంది, ఫిబ్రవరి 28: అక్షయపాత్ర ఫౌండేషన్ మంచి లక్ష్యంతో సమాజానికి అందిస్తున్న సేవలు అమోఘమని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కొనియాడారు. అందరి ఆకలి తీరుస్తూ అండగా నిలుస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్ భవిష్యత్తులో మరిన్ని విజయ శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని అక్షయపాత్ర ఫౌండేషన్ 15వ వార్షికోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. అక్షయ పాత్ర ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు కావాల్సిన పోషకాహారాన్ని అందిస్తూ, ఆ లోపాన్ని తొలగిస్తున్నదని అభినందించారు. అక్షయపాత్ర ఫౌండేషన్ వంటి లాభాపేక్ష లేని సంస్థలను ప్రోత్సహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. తనవంతుగా అక్షయపాత్రకు ఎన్వీ రమణ రూ.2 లక్షల చెక్కును అందజేశారు. యంత్రాలను ప్రారంభించారు. కార్యక్రమంలో అక్షయపాత్ర ఫౌండేషన్ చైర్మన్ మధు పండిత దాస, హైదరాబాద్ ట్రస్టీ, ప్రాంతీయ అధ్యక్షుడు సత్యగౌర చంద్ర పాల్గొన్నారు.