హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): మహిళా సంఘాలకు అవసరమైన రుణాలను సమకూర్చడంలో కీలకపాత్ర పోషిస్తున్నది గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్). మహిళలు ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, లోన్యాప్లు, ప్రైవేటు బ్యాంకులు, ప్రైవేటు చిట్ఫండ్ సంస్థల బారిన పడకుండా వారికి అవసరమైన రుణాలను బ్యాంకర్ల ద్వారా అందజేస్తున్నది. తీసుకున్న రుణాన్ని తిరిగి సకాలంలో చెల్లిస్తే ఆ వడ్డీని సైతం ప్రభుత్వమే చెల్లిస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల ద్వారా మహిళలకు రూ.18 వేల కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించగా ఇప్పటికే రూ.15 వేల కోట్లు పంపిణీచేశారు. అంటే 83 శాతం లక్ష్యాన్ని సాధించారు.
రాష్ట్రంలో 4.30 లక్షల మహిళా సంఘాలు ఉన్నాయి. వీటిలో దాదాపుగా 46 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. ఇందులో 3.67 లక్షల సంఘాలకు రుణాలు ఇవ్వాలన్నది లక్ష్యం కాగా 2.45 లక్షల సంఘాలకు రుణాలు అందజేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో లక్ష్యాన్ని పూర్తిగా సాధించారు. సంగారెడ్డి జిల్లాలో 99.55 శాతం, నారాయణ్పేట జిల్లాలో 91.54 శాతం లక్ష్యాన్ని చేరుకున్నారు.
అతి తక్కువ లక్ష్యాలు సాధించినవాటిలో జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కొత్తగూడెంభద్రాద్రి, హనుమకొండ, ములుగు జిల్లాలు ఉన్నాయి. ఈ ఐదు జిల్లాలు 75 శాతం లక్ష్యాన్ని కూడా సాధించలేదు. ఆయా జిల్లాల్లో సైతం మార్చి ఆఖరు నాటికి లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం ఇటీవల బ్యాంకర్లు, జిల్లా ఉన్నతాధికారులతో ఉన్నతాధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్చి మొదటి వా రం కల్లా లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు.
మహిళల ఉపాధికి సెర్ప్ బాటలు
మహిళా సంఘాలు వడ్డీ లేని రుణాన్ని సద్వినియోగం చేసుకోవాలని సెర్ప్ అధికారులు సూచిస్తున్నారు. తద్వారా మహిళలు ఆర్థిక సాధికారిత సాధించవచ్చునని చెప్తున్నారు. మహిళలు వ్యాపారాలు చేసుకోవడానికి వీలుగా వారికి అవసరమైన రుణాలను అందజేస్తున్నారు. దీంతో మహిళలు ఆయా వ్యాపారాల ద్వారా తమ కుటుంబాలను పోషించుకోవడమే కాకుండా మరికొందరికి ఉపాధి చూపిస్తున్నారు. మహిళలు అధిక వడ్డీల బారిన పడకుండా, వడ్డీల భారం భరించలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తలెత్తకుండా సెర్ప్ అధికారులు కృషిచేస్తున్నారు.
రుణాలు ఇప్పించడమే కాకుండా తీసుకున్న రుణ మొత్తం ఎంతవరకు సద్వినియోగం అవుతున్నదో క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. మహిళా సంఘాలు తాము తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లిస్తుండటంతో ఎన్పీఏలు రెండు శాతం లోపే ఉంటున్నాయి. దీంతో బ్యాంకులు కూడా మహిళా సంఘాలకు ఎంత రుణం అయినా ఇవ్వడానికి ఉత్సాహంగా ముందుకొస్తున్నాయని సెర్ప్ అధికారులు చెప్తున్నారు. బ్యాంకుల ద్వారానే కాకుండా అదనంగా స్త్రీనిధి ద్వారా రూ.2,394 కోట్లు రుణం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు రూ.1,613 కోట్ల రుణాన్ని అం దించారు. స్త్రీనిధి లక్ష్యంలో 67 శాతం చేరారు.
రుణాల పంపిణీలో సాధించిన ప్రగతి
బ్యాంకుల రుణ లక్ష్యం : రూ.18,000 కోట్లు
ఇప్పటివరకు ఇచ్చింది : రూ.15,000 కోట్లు
సాధించిన లక్ష్యం : 83 శాతం
స్త్రీనిధి రుణ లక్ష్యం : రూ.2,394 కోట్లు
ఇప్పటివరకు ఇచ్చింది : రూ.1,613 కోట్లు
సాధించిన లక్ష్యం : 67 శాతం