న్యూస్ నెట్వర్క్, (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో హోలీ వేడుకల్లో పలుచోట్ల తీవ్ర విషాదం నెలకొన్నది. హోలీ ఆడిన తర్వాత స్నానాలు చేసే క్రమంలో నదులు, కాల్వలు, చెరువు వద్దకు వెళ్లి వేర్వేరుచోట్ల 14 మంది మృత్యువాత పడ్డారు. మరొకరు గల్లంతయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. పోలీసులు, మృతుల కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాల మండల కేంద్రంలోని నదీమాబాద్కు చెందిన పనాస కమలాకర్ (23), ఉప్పుల సంతోష్ (22), ఎల్ములే ప్రవీణ్ (23), ఆలం సాయి (20).. తాటిపల్లి సమీపంలోని వార్దా నదికి స్నానానికి వెళ్లి నీట మునిగి చనిపోయారు.
మంచిర్యాలలో ఇంటర్ విద్యార్థి
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన ఇంటర్ చదివే కార్తిక్ తన స్నేహితులతో కలిసి స్నానం చేయడానికి తానిమడుగు డెలివరీ పాయింట్ వద్ద నీటిలోకి దిగాడు. ఈత రాకపోవడంతో నీళ్లలో మునిగి చనిపోయాడు.
వాగులో మునిగి ఒకరు
ఆదిలాబాద్లోని జైజవాన్ నగర్కు చెందిన హర్షిత్ (14) హోలీ ఆడిన తర్వాత ఆదిలాబాద్ మండలంలోని భీంసరి వాగులో స్నానం చేయడానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు వాగులో మునిగి మృతి చెందాడు.
నందుపల్లి పెద్ద చెరువులో ఇద్దరు
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నందుపల్లికి చెందిన ఇద్దరు చెరువులో పడి మృతి చెందారు. గ్రామానికి చెందిన భిక్షమయ్య కుమారుడు సంగం జగన్ (27) వ్యవసాయం చేస్తాడు. అదే గ్రామానికి చెందిన రామయ్య కుమారుడు కొమ్ము సురేందర్ (28) వృత్తి డ్రైవర్. ఇద్దరు హోలీ ఆడుకొని నందపల్లి పెద్ద చెరువు దగ్గరకు ఈతకు వెళ్లారు. ఇద్దరు చెరువులోకి దిగి ఈత కొడుతూ కనిపించకుండాపోయారు. గజఈతగాల సహాయంతో ఇద్దరు మృతదేహాలను బయటకు తీశారు.
ట్యాంకు కూలి చిన్నారులకు గాయాలు
నారాయణపేట జిల్లా కేంద్రంలోని 20వ వార్డులో హోలీ సంబురాల్లో చిన్నారులు నిమగ్నమై ఉండగా.. పక్కనున్న వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా కూలిపడింది. సిమెంట్ ముక్కలు తగిలి చిన్నారులపై పడటంతో లక్ష్మీప్రణీత(12), నిహారిక, హరిప్రియకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని దవాఖానకు తరలించగా.. చికిత్స పొందుతూ లక్ష్మీప్రణీత చనిపోయింది.
వ్యవసాయ బావిలో ఈత కొడుతూ..
వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలం మామిడిమాడలో హోలీ అనంతరం యువకులు స్నానం చేసేందుకు వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. ఈత కొడుతున్న సమయం లో శ్రీకాంత్ (16) నీటిలో మునిగిపోయాడు. గమనించిన స్నేహితులు బయటికి తీసి దవాఖానకు తరలించినా అప్పటికే చపోయాడు.
మహబూబాబాద్లో బాలుడు
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన అబ్బోరి వినోద్రెడ్డి కుమారుడు రిత్విక్రెడ్డి (10) 4వ తరగతి చదువుతున్నాడు. హోలీ అనంతరం స్నానం చేసేందుకు గణేశ్ చెరువు వద్దకు వెళ్లాడు. కాలు జారి చెరువులోని గుంతలో పడిపోయాడు. అతని స్నేహితులు భయంతో వచ్చి గ్రామంలో చెప్పడంతో గ్రామస్తులు అక్కడికి వెళ్లి చూసేసరికి రిత్విక్ మృతి చెందాడు.
మొర్రేడు వాగులో ఆటో డ్రైవర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రామాంజనేయ కాలనీకి చెందిన మోకాళ్ల రాంబాబు (25) ఆటో డ్రైవర్. స్థానికులతో హోలీ ఆడాడు. స్నేహితులతో కలిసి స్నానం చేసేందుకు మొర్రేడు వాగు వద్దకు వెళాడు. రాంబాబు వాగులో దిగడంతోనే బండపై కాలు పెట్టాడు. అది జారడంతో లోతులోకి మునిగి మృతిచెందాడు.
ముగ్గురిని కాపాడిన కానిస్టేబుల్
ముగ్గురు స్నేహితులు హోలీ సందర్భంగా రంగులు పూసుకున్నారు. గోదావరిలో స్నా నం చేసేందుకు వెళ్లి గల్లంతయ్యారు. స్థానికు ల ద్వారా సమాచారం అందుకున్న ఓ కానిస్టేబుల్ నిమిషాల్లో నది వద్దకు చేరుకుని వారిని ప్రాణాలతో బయటకు తీసువచ్చాడు. ఈ ఘటన భద్రాద్రి జిల్లా మణుగూరు మండల పరిధిలోని కొండాయిగూడెంలో జరిగింది.
ఎస్సారెస్సీ కెనాల్లో పడి ఇద్దరు
హనుమకొండలోని కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలివేల్పుల ఎస్సారెస్సీ కెనాల్లో పడి ఇద్దరు మృతి చెందారు. ఒకరు గల్లంతయ్యారు. దామెర మండలం ఊరుగొండకు చెందిన తక్కెళ్ల కేదారేశ్వర్(42), ముప్పు క్రాంతికు మార్(35) పలివేల్పుల వద్ద అద్దె గృహంలో ఉంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. హోలీ వేడుకల్లో పాల్గొన్న వీరు ఊరుగొండకు చెందిన పండుగ భిక్షపతి పలివేల్పుల సమీపంలోని ఎస్సారెస్పీ మెయిన్ కెనాల్ వద్దకు వెళ్లారు. స్నానం కోసం కేదారేశ్వర్, కాంత్రికుమార్ కెనాల్లో దిగగా నీటి ప్రవాహ వేగానికి గల్లంతు కాగా, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మృతదేహాలను వెలికితీశారు. కేదారేశ్వర్కు భా ర్య, ఇద్దరు పిల్లలు, క్రాంతికుమార్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.