Pochampadu Genco | మెండోరా : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు( Sriramsagar ) జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నది. 1998-99 ఆర్థిక సంవత్సరంలో 137.95 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 138 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి( Power Generation ) కావడంతో రికార్డు బ్రేక్ అయ్యింది. శ్రీరాంసాగర్లో 1987-88 ఆర్థిక సంవత్సరంలో జల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. అప్పటి నుంచి మూడు టర్బైన్లతో విద్యుత్ ఉత్పత్తిని చేసేవారు. 2010వ సంవత్సరంలో మరో టర్బైన్ ఏర్పాటు చేయడంతో నాలుగు టర్బైన్లతో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. ఒక్కో టర్బైన్ నుంచి 9 మెగావాట్ల చొప్పున నాలుగింటితో 36 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు.
అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో అధికారులు నిరంతర శ్రమతో ఒక్కో టర్బైన్ నుంచి 9 మెగావాట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తిని చేయగలిగారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదలు వచ్చి ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి నిరంతరం విద్యుత్ ఉత్పత్తి జరిగింది. జెన్కో ప్రారంభమైన నాటి నుంచి 1990-1991 ఆర్థిక సంవత్సరంలో 147 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడంతో రికార్డు నమోదైంది. ఇప్పటివరకు ఆ రికార్డును బ్రేక్ చేయలేకపోయారు. ప్రస్తుతం కాకతీయ కాలువకు అనుసంధానంగా ఉన్న ఎస్కేప్ గేట్లు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసి మ్యానువల్, ఆటోమేటిక్ గేట్లను ఏర్పాట్లు చేయడంతో విద్యుత్ ఉత్పత్తిని అదనంగా సాధించగలుగుతున్నారు. మరో రెండు రోజుల్లో 140 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.