హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): డాటా సైన్స్ సర్టిఫికెట్ కోర్సును విజయవంతంగా పూర్తిచేసిన 120 మంది తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీల విద్యార్థినులకు మంగళవారం సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. గురుకులాల సొసైటీ కార్యదర్శి రొనాల్డ్ రోస్ వారికి ధ్రువపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి నైపుణ్యాలను పెంపొందించడంతోపాటు సాఫ్ట్వేర్, ఇతర పరిశ్రమల్లో నియామకాలకు మార్గం సుగమం చేయడం, తద్వారా పేదరికపు సంకెళ్లను తొలగించే లక్ష్యంతో గురుకులాల సొసైటీ పనిచేస్తున్నదని అన్నారు.
ఇందుకోసం పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇచ్చేందుకు వివిధ పరిశ్రమలతో ఒప్పందం చేసుకున్నదని చెప్పారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద డాటా సైన్స్ శిక్షణ శిబిరాన్ని నిర్వహించిన వెల్స్ ఫార్గో, యునైటెడ్వే హైదరాబాద్ సంస్థలను ప్రత్యేకంగా అభినందించారు. ల్యాప్ టాప్లు, ప్రొజెక్టర్లు, స్రీన్లు మొదలైనవాటిని ఉచితంగా అందించడంలో ప్రధాన పాత్ర పోషించినందుకు వెల్స్ ఫార్గో ప్రతినిధులు బందన ఝా, నిధి ప్రతాపనేనిని ప్రశంసించారు.