ఉపాధి హామి పనికి హాజరైన కూలీలు
నిజామాబాద్ జిల్లాలో లక్ష మంది
వికారాబాద్ జిల్లాలో 90 వేలు
గత ఏడాది కంటే ఎక్కువ హాజరు
కూలీలకు రాష్ట్ర సర్కారు భరోసా
హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): ఒకవైపు తగ్గిన వరి సాగు.. మరోవైపు ఎండవేడికి ఇతర పనులకు వెళ్లలేని పరిస్థితి.. దీంతో ఉపాధి హామీ పనులవైపు కూలీలు మొగ్గు చూపుతున్నారు. ఈ నెల 13న రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 12,25,002 మంది కూలీలు ఉపాధి పనులకు హాజరయ్యారు. ఆ ఒక్క రోజే కూలీలంతా కలిసి రూ.20.40 కోట్ల విలువైన పనులు చేశారు. రాష్ట్రంలో 12,706 గ్రామాల్లో ఉపాధి పనులు కొనసాగుతున్నాయి. 63 గ్రామ పంచాయతీల్లో వివిధ కారణాలతో పనులు ప్రారంభం కాలేదు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూలీలకు మౌలిక సదుపాయాల పనులు కల్పిస్తున్నారు. రాబోయే వర్షాకాలానికి నర్సరీల్లో మొక్కలు పెంచే కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. నీటి సంరక్షణ పనులకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు.
మొక్కలు ఎండిపోకుండా నీళ్లు పోయడం తదితర పనులను చేయిస్తున్నారు. నీటి వనరులను సంరక్షించడం, మొక్కల పెంపకం, ఇతర సహజ వనరులను సంరక్షించే పనులను అప్పగిస్తున్నారు. అసంపూర్తిగా ఉన్న రైతు కల్లాల నిర్మాణం, ఇంకుడు గుంతలు, ఫీడర్ చానల్స్ నిర్మాణం, భూమిని చదును చేయడం, కాంటూరు కందకాలు, నీటి కాల్వ కందకాలు, పంట పొలాలకు ఫీడర్ కాలువల పనులను కూలీలు చేస్తున్నారు. భూములను అభివృద్ధి చేయడం, చేపల కుంటలు ఏర్పాటు చేయడం, పశువుల కొట్టాలు, మేకల షెల్టర్లు తదితర పనులు చేస్తున్నారు.
కేంద్రం ఇవ్వకున్నా రాష్ట్ర సర్కారు ముందడుగు
కేంద్రంలోని మోదీ సర్కారు ఉపాధి హామీకి కేంద్ర బడ్జెట్లో నిధులు తగ్గించినా, రాష్ర్టానికి తక్కువ పని దినాలు కేటాయించినా.. కూలీలకు పని కల్పించాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఉపాధి పనులు చేయిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్ల పని దినాలు కావాలని అడిగితే, కేంద్రం కేవలం 10 కోట్ల పని దినాలను ఇచ్చింది. అయినా, ఉపాధి హామీ పనుల విషయంలో వెనక్కి తగ్గకుండా రాష్ట్ర ప్రభుత్వం కూలీలకు పని కల్పిస్తున్నది. గత ఆర్థిక సంవత్సరం కూలీలకు 14.40 కోట్ల పనిదినాలను కల్పించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంత కంటే ఎక్కువగానే పనిదినాలు అవుతాయని, ప్రస్తుతం పనులకు కూలీలు హాజరవుతున్న తీరు ఆధారంగా అధికారులు అంచనా వేస్తున్నారు.