హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల మరమ్మతులకు రూ.10.84 కోట్లు ఖర్చు చేయనున్నట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. 14 జిల్లాల పరిధిలోని 4 జిల్లా దవాఖానలు, 8 ఏరియా హాస్పిటళ్లు, 3 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో మరమ్మతులు చేపట్టనున్నట్టు వెల్లడించారు. సోమవారం హైదరాబాద్లోని ఎంసీహెచ్చార్డీలో వైద్యారోగ్యశాఖ అధికారులతో మంత్రి హరీశ్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, జ్వర సర్వే, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్, నిర్మల్, కరీంనగర్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లోని దవాఖానల్లో లేబర్ రూముల ఆధునీకరణ, డ్రైనేజీ, విద్యుత్తు సరఫరా తదితర అన్ని రకాల మరమ్మతులు చేపట్టనున్నట్టు వెల్లడించారు. ప్రజలకు ఉచిత, నాణ్యమైన వైద్యం అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నదని.. ఓవైపు కొత్త మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు ఏర్పాటు చేస్తూనే, ఇప్పటికే ఉన్న దవాఖానలను ఆధునీకరిస్తున్నదని వివరించారు. ఆరోగ్య తెలంగాణ కలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని చర్యలు తీసుకొంటున్నారని తెలిపారు. అందులో భాగంగానే కొత్తగా 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారని గుర్తు చేశారు. అటు.. రాష్ట్రంలో కరోనా కట్టడికి జ్వర సర్వే విజయవంతంగా కొనసాగుతున్నదని మంత్రి చెప్పారు. సెకండ్ డోస్, బూస్టర్ డోస్, 15-17 ఏండ్ల వయస్కులకు 100 శాతం వ్యాక్సినేషన్ సాధించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సమీక్షలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీఎంఈ రమేశ్రెడ్డి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొత్తగా 20 బ్లడ్ స్టోరేజీ సెంటర్లు
రాష్ట్రంలో కొత్తగా 20 రక్త నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకొకటి రూ.12 లక్షల ఖర్చుతో 12 జిల్లాల పరిధిలోని పలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా దవాఖానల్లో నెలకొల్పనున్నది. రాష్ట్రంలో ప్రస్తుతం 57 బ్లడ్ బ్యాంకులు, 51 బ్లడ్ స్టోరేజ్ సెంటర్లు ఉన్నాయి.