హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): ఇంగ్లిష్ మీడియం చదువులు.. నాణ్యమైన విద్యకు కేరాఫ్ అడ్రస్ అయిన తెలంగాణ మాడల్ స్కూల్స్లో పరిస్థితి రోజురోజుకూ మరింతగా దిగజారుతున్నది. పేరుకు ఆదర్శ పాఠశాలలుగా పిలుస్తుండగా, ఆచరణలో మాత్రం అంత ఆదర్శంగా కనిపించడంలేదు. పేరుకు మాడల్.. పరిస్థితులు మాత్రం డల్ అన్నట్టుగా పరిస్థితి తయారయ్యింది. ఈ బడుల్లో భారీగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫలితంగా టీచర్ల కొరత సమస్య వేధిస్తున్నది. మొత్తం పోస్టుల్లో ఏకంగా 27% పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్ సర్కార్ ఈ పోస్టులను నింపేందుకు నోటిఫికేషన్ జారీచేయడంలేదు. ప్రిన్సిపాల్ 97, పీజీటీ 560, టీజీటీ 409కిపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
51వేలకు పైగా సీట్లు ఖాళీ..
మాడల్ స్కూల్స్లో ఇటీవల భారీగా సీట్లు మిగులుతున్నాయి. ఈ విద్యాసంవత్సరం ఏకంగా 51వేలకు పైగా సీట్లు మిగిలాయి. నిరుటితో పోల్చితే ఈ ఏడాది 15వేల అడ్మిషన్లు తగ్గాయి. 2017లో రికార్డుస్థాయిలో 1.36లక్షల సీట్లు నిండాయి. ఆ తర్వాత నుంచి ఏటా అడ్మిషన్లు తగ్గుతున్నాయి. మాడల్ స్కూల్స్పై గురుకులాల అడ్మిషన్ల ప్రభావం పడుతున్నది. గురుకులాల్లో వసతి, మంచి మెనూ అమలుచేయడం, మాడల్ స్కూల్స్లో మధ్యాహ్న భోజనం మాత్రమే ఉండటంతో విద్యార్థులు గురుకులాలవైపు చూస్తున్నారు.
గురుకులాల్లో 5వ తరగతిలోనే అడ్మిషన్లు తీసుకుంటున్నారు. అదే మాడల్ స్కూల్స్లో 6వ తరగతిలో చేర్చుకుంటున్నారు. అంటే గురుకులాల్లో చేరగా మిగిలిన విద్యార్థులను అటూ మాడల్ స్కూళ్లు.. ఇటూ జిల్లాపరిషత్, ప్రభుత్వ బడులు పంచుకోవాల్సి వస్తున్నది. ఇది కూడా అడ్మిషన్లు తగ్గేందుకు ప్రధాన కారణమని తెలంగాణ మాడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భూతం యాకమల్లు విశ్లేషించారు. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీచేయాలని డిమాండ్ చేశారు. మాడల్ స్కూల్స్లో ఇంటర్ చదువులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎంపీసీ, బైపీసీ వంటి డిమాండ్ ఉన్న కోర్సులను కాకుండా డిమాండ్లేని ఎంఈసీ, సీఈసీ కోర్సులు నిర్వహిస్తున్నారు. ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో చేరాలనుకునే వారు 10వ తరగతి తర్వాత ఇతర కాలేజీల్లో చేరిపోతున్నారు.
రోజుకో ప్రయోగం..
విద్యాశాఖ, ప్రభుత్వాలు మాడల్ స్కూల్స్పై అనేక ప్రయోగాలు చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వీటితో ఆటలాడుకుంటున్నారు. వీటిల్లో 5వ తరగతి ప్రవేశపెడుతామని ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు. కొంతకాలం క్రితం మాడల్ స్కూల్స్ను తెలంగాణ పబ్లిక్ స్కూల్స్గా అప్గ్రేడ్ చేస్తామన్నారు. అధికారులు క్షేత్రస్థాయి అధ్యయనం కూడా చేశారు. ఆ తర్వాత ఇదే స్కూల్స్లో సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెడుతామన్నారు. ఇటీవలే జిల్లాకొకటి చొప్పున 29 స్కూళ్లను సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లు నెలకొల్పుతామన్నారు. టీచర్ పోస్టులను భర్తీచేయకుండా ఇలా రోజుకో కొత్త అంశాన్ని తెరపైకి తేవడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ పాఠశాలల్లో వసతుల లేమి సైతం పట్టిపీడిస్తున్నది. 194 బడుల్లో180 స్కూళ్లలోనే బాలికలకు హాస్టళ్లున్నాయి. మరో 14 బడుల్లో హాస్టళ్లు లేవు. వీటిల్లో కేవలం 100 మందికే ఆశ్రయం కల్పిస్తున్నారు. మిగతా బాలికలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
ఖాళీల ‘మాడల్’ ఇదేనా..
రాష్ట్రంలో 194 మాడల్స్కూల్స్ ఉన్నాయి. వీటిలో 3,880 పోస్టులుండగా.. ప్రస్తుతం 2,800 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 1,080 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2011-12 విద్యాసంవత్సరంలో నోటిఫికేషన్ ద్వారా నియమితులైన టీచర్లలో కొందరు రిటైర్మెంట్ అవుతున్నారు. మరికొందరు రోడ్డు ప్రమాదాలు, అనారోగ్య కారణాలతో చనిపోతున్నారు. మొత్తంగా ఖాళీలు పెరుగుతుండగా, రిక్రూట్మెంట్ జాడేలేదు. టీచర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో బోధనపై తీవ్ర ప్రభావం పడుతున్నది.
