హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మీదున్న ప్రేమ.. వృత్తిరీత్యా లండన్లో ఉంటున్నా మాతృభూమి సంక్షేమాన్ని ప్రపంచానికి చాటాలన్న తపన.. తెలంగాణ సాధించిన వ్యక్తిగా ముఖ్యమంత్రి కేసీఆర్ మీదున్న అమితమైన అభిమానం.. ఆయనతో 1,07,000 ట్వీట్లు చేయించింది. లండన్లో ఉంటున్న తెలంగాణ బిడ్డ, ఎన్ఆర్ఐ-టీఆర్ఎస్ యూకే ఇన్చార్జి భువనగిరి నవీన్ నాలుగేండ్లలోనే లక్షకు పైగా ట్వీట్ల మైలురాయిని అధిగమించారు. ఈ సందర్భంగా ఆయనను ‘నమస్తే తెలంగాణ’ పలుకరించగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
శ్రమ అనుకోలేదు.. బాధ్యతగా ఫీలయ్యా
2018 ఎన్నికల సమయంలో నేను ట్విట్టర్ అకౌంట్ తెరిచాను. తెలంగాణ ప్రజల కోసం.. అభివృద్ధి కోసం.. రాష్ట్రం సాధించిన కేసీఆర్ కోసం.. ఎప్పటికప్పుడు వివిధ రకాల న్యూస్ సోర్సుల ద్వారా వచ్చిన సమాచారాన్ని ట్విట్టర్లో పెట్టేవాడిని. దాదాపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల కోసం నా ట్విట్టర్, ఫేస్బుక్లో లెక్కలేనన్ని పోస్టులు పెట్టాను. సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన అద్భుత సంక్షేమ పథకాలు.. తెలంగాణ వచ్చాక ప్రజా జీవితాల్లో వచ్చిన మార్పులను అందరికీ తెలియజేయాలనుకొన్నా. అందుకోసం ప్రతిరోజు బ్రేక్ తీసుకోకుండా సోషల్ మీడియాను ఎంత బాగా వాడుకోవచ్చో, దానితో ఏమేం చేయొచ్చో అన్నీ చేశా. ఇదంతా శ్రమ అనుకోలేదు. ఒక నిబద్ధతతో చేసే యజ్ఞంలా భావించా. నాకు జన్మనిచ్చిన మాతృభూమి కోసం నావంతు బాధ్యత ఇది. ఇప్పటికీ, ఎప్పటికీ ఒక వలంటీర్గా తెలంగాణ కోసం నా సేవలు కొనసాగిస్తూనే ఉంటా. మన రాష్ట్రం కోసం రోజుకు వందల సంఖ్యలో ట్వీట్లు చేశా. పొద్దున లేచింది మొదలు పడుకొనేదాకా అదే పనిలో ఉండేవాడిని. ఆ రోజులు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతిని ఇచ్చాయి.
తెలంగాణే నన్ను ప్రభావితం చేసింది
1969 తెలంగాణ ఉద్యమ చరిత్రను చదివా. ఆ తర్వాత 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ స్థాపన, ఆయన ఉపన్యాసాలు నాకు స్ఫూర్తినిచ్చాయి. వరంగల్, నల్లగొండ జిల్లాల్లోని కొన్ని గ్రామాలకు వెళ్లినప్పుడు కూలిపోయిన గోడలు, ఎండిపోయిన చెరువులు, పేదరికం, వెనుకబాటుతనం నన్ను బాగా కదిలించాయి. పుట్టిన తెలంగాణ కోసం నాకు చేతనైనది ఏదైనా చేయాలనిపించేది. తెలంగాణ ఉద్యమంలో విదేశాల నుంచి మద్దతు అందించటంలో కీలకపాత్ర పోషించా అని గర్వంగా చెప్పుకుంటా. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, రెండోసారి ఎన్నికల్లో టీఆర్ఎస్ అద్భుత విజయం నేను ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకాలు. ఎవరో చెప్పారనో, ఏదో పేరు కోసమో కాదు. అచ్చంగా తెలంగాణ కోసం, ఆ తెలంగాణను సాధించిన కేసీఆర్ కోసం స్వచ్ఛందంగా పోరాడే సైనికుడిని నేను.
నేను సోషల్ మీడియా వారియర్ను
రాజకీయ పార్టీలు సోషల్ మీడియాలో ఈ పని చేయడానికి ఒక్కొక్కరికి లక్షల జీతాలు ఇచ్చి మరీ నియమించుకొంటాయి. కానీ ఇంత నిబద్ధతతో, అర్థవంతంగా వందల పోస్టులు/ట్వీట్లు పెట్టడం మాములు విషయం కాదు. అయితే ఇందుకోసం టీఆర్ఎస్ నుంచి నేను ఎలాంటిదీ ఆశించటం లేదు. నాకు కేసీఆర్, కేటీఆర్, కవిత బాగా తెలుసు. నేను తెలంగాణ కోసం, కేసీఆర్ కోసం పనిచేస్తున్న ఓ సైనికుడిని అంతే. టెక్నాలజీ భాషలో చెప్పాలంటే నేను ‘కేసీఆర్ సోషల్మీడియా వారియర్’ను.
సాఫ్ట్వేర్ ఇంజినీర్గా మొదలై.. సొంతంగా కంపెనీ పెట్టే స్థాయికి
భువనగిరి నవీన్ స్వస్థలం ఖమ్మం జిల్లా పాల్వంచ. స్థానిక డీఏవీ నవభారత్ స్కూల్లో చదువుకొన్నారు. ఆడమ్స్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చేశారు. 2004లో సత్యం కంప్యూటర్స్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా చేరారు. 2007లో అమెరికా వెళ్లి అక్కడ కొంతకాలం పని చేశారు. కానీ, తెలంగాణపై తనకున్న ప్రేమ, అభిమానాన్ని వదులుకోలేదు. 2010లో టెక్మహీంద్రాలో ప్రాజెక్ట్ మేనేజర్గా లండన్కు వెళ్లారు. మాములు ఇంజినీర్గా మొదలై స్వయం కృషితో లండన్లో బీవీఆర్ టెక్ పేరుతో సొంతంగా కంపెనీ స్థాపించి, ఇండిపెండెంట్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నారు.
దేశంలో ఎవరూ సాధించని ఘనత
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉండే సెలబ్రిటీ బిగ్బీ అమితాబ్ బచ్చన్ మొత్తంగా 68,900 ట్వీట్లు చేశారు. వివాదాస్పద డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ 2009 నుంచి ఇప్పటి వరకు 11,600 ట్వీట్లే చేశారు.
ప్రపంచ కుబేరుల్లో ఒకడిగా, ట్విట్టర్ను దక్కించుకోవాలని చూస్తున్న ఎలాన్ మస్క్ సైతం ఇప్పటి వరకు చేసిన ట్వీట్లు 17,300 మాత్రమే.
భారత్లో అతిపెద్ద సోషల్మీడియా నెటవర్క్ ఉన్న బీజేపీ, కాంగ్రెస్ ట్విట్టర్ అకౌంట్లు, ఆ పార్టీ సోషల్ మీడియా వారియర్లు ఎవరూ లక్ష ట్వీట్లు చేయలేదు. కానీ నవీన్ ఆ ఘనత సాధించారు.
మన దేశంలో ఓ ట్వీట్కు లక్షకుపైగా లైక్స్, షేర్స్ వచ్చి ఉంటాయి. కానీ ఒక అకౌంట్ నుంచి లక్ష ట్వీట్లు ఎవరూ చేయలేదు.
సోషల్ మీడియా మెయింటెనెన్స్ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించుకొన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా 2009 నుంచి ఇప్పటి వరకు 32,900 ట్వీట్లు మాత్రమే చేశారు.