హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ):రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జల విద్యుత్తు ప్రాజెక్టుల సామర్థ్యం మేరకు 100 శాతం విద్యుత్తును ఉత్పత్తిచేయాలని ప్రభుత్వం టీఎస్ జెన్కోను ఆదేశించింది. రాష్ట్రంలోని దాదాపు 2,500 మెగావాట్ల వరకు విద్యుత్తును ఉత్పత్తి చేయగల ప్రాజెక్టుల్లో వందశాతం ఉత్పత్తి చేయాలని ఉత్తర్వులు జారీచేసింది. గతంలో ఎన్నడూ ఇలా ఆదేశించిన దాఖలాలు లేవు. కృష్ణానది నుంచి ఏపీ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించుకుపోతు న్న నేపథ్యంలో తెలంగాణ జల విద్యుదుత్పత్తిపై దృష్టి సారించడం గమనార్హం. రాష్ట్రంలో కాళేశ్వరం లాంటి భారీ ఎత్తిపోతల పథకాలకు అదేస్థాయిలో విద్యుత్తు అవసరమవుతున్నది. ఈ నేపథ్యంలో అతిచౌకగా లభిం చే జల విద్యుత్తును రాష్ట్ర అవసరాలమేరకు ఉపయోగించుకోవాలని సీఎం కేసీఆర్ ఇటీవల జరిగిన మంత్రివర్గ భేటీలో ప్రస్తావించినట్టు సమాచారం.
ప్రాజెక్టులన్నీ కృష్ణా నదిపైనే
రాష్ట్రంలో కృష్ణానదిపైనే జల విద్యుత్తు ప్రాజెక్టులన్నీ ఉన్నాయి. జూరాల మొదలుకొని పులిచింతల వరకు ఉన్న జలవిద్యుత్తు ప్రాజెక్టుల్లోనే సుమారు 2,370 మెగావాట్ల వరకు జల విద్యుదుత్పత్తి కేంద్రాలున్నాయి. నిజాంసాగర్లో 10 మెగావాట్లు, ఎస్సారెస్పీ వద్ద 36 మెగావాట్లు, సింగూరు వద్ద 15 మెగావాట్లు మొత్తం 61 మెగావాట్ల వరకు మాత్రమే గోదావరి నదిపై జల విద్యు దుత్పత్తికి అవకాశం ఉంది. కృష్ణా నదిపై శ్రీశైలం, నాగార్జునసాగర్ వద్ద 1,715.60 మెగావాట్ల జల విద్యుత్తు ప్రాజెక్టులున్నాయి. సాగర్ ఎడమ కాల్వపై 60 మెగావాట్లు, జూరాల, లోయర్ జూరాల ప్రాజెక్టుల వద్ద 474 మెగావాట్ల జల విద్యుత్తు ప్రాజెక్టులున్నాయి. పులిచింతల వద్ద 120 మెగావాట్లు.. మొత్తంగా కృష్ణానదిపైనే 2,370 మెగావాట్ల జల విద్యుత్తు ప్రాజెక్టులు, 11.16 మెగావాట్ల మినీ హైడల్ ప్రాజెక్టులు కలుపుకొని 2441.71 మెగావాట్ల జల విద్యుత్తు ప్రాజెక్టులు మన రాష్ట్రంలో ఉన్నాయి.