హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారిపై మరోసారి కాసుల వర్షం కురిసింది. సెప్టెంబర్లో హుండీ ద్వారా రూ.111.65 కోట్లు వచ్చినట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. శుక్రవారం ‘డయల్ యువర్ ఈవో’లో ఆయన పలు వివరాలు వెల్లడించారు. గత నెలలో శ్రీవారిని 21.01 లక్షల మంది భక్తులు దర్శించుకోగా, లడ్డూలు 1.11 కోట్లు విక్రయించారు. గత ఏడాది మార్చి నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం నెలకు రూ.100 కోట్ల మార్క్ దాటేసింది. తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో నూతనంగా వేదాశీర్వచనం, కుంకుమార్చన ఆర్జిత సేవలను ప్రవేశపెట్టామని, టీటీడీ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోచ్చని చెప్పారు. శ్రీపద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్కు ఆసియా టుడే రీసెర్చ్ అండ్ మీడియా సంస్థ ‘ప్రైడ్ ఆఫ్ నేషన్’ అవార్డు ప్రకటించడం సంతోషంగా ఉందని తెలిపారు. తిరుపతికి చెందిన సూర నరహరి-కుసుమ దంపతులు స్థానిక శ్రీకపిలేశ్వర స్వామికి దాదాపు రూ.14 లక్షల విలువైన 16 కిలోల వెండితో నాగపడగ, కిరీటం బహూకరించారు.