రఘునాథపాలెం, డిసెంబర్ 19: తెలంగాణ ఆవిర్భవించాక రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిగా ఏర్పాటు చేసింది బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తేనని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం పంచాక్షరి కాలనీ వెలుగుమట్లలో రూ.75 లక్షలతో నిర్మించనున్న తెలంగాణ సంక్షేమ పరిషత్ అపరకర్మ భవన నిర్మాణ పనులను రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ కేవీ రమణాచారితో కలిసి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కు ఏటా రూ.100 కోట్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని గుర్తుచేశారు.
ఒక్క తెలంగాణలోనే అర్చకులకు ట్రెజరీ ద్వారా వేతనాలు ఇస్తున్నారని తెలిపారు. వివేకానంద విదేశీ విద్యా పథకం కింద బ్రాహ్మణుల పిల్లలకు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి రూ.20 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక, వ్యాపార వేత్తలకు ప్రోత్సాహకం కింద ఇప్పటివరకు 3,647 మందికి రూ.103 కోట్లను అందించినట్టు తెలిపారు. హైదరాబాద్లో 6 ఎకరాల్లో ఇంద్ర భవనంలా బ్రాహ్మణ సదనం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నదని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ, సుడా చైర్మన్లు కూరాకుల నాగభూషణం, బచ్చు విజయ్కుమార్, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ వైస్ చైర్మన్ వనం జ్వాలా నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.
పేద బ్రాహ్మణుల సంక్షేమానికి చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. హైదరాబాద్, సూర్యాపేటల్లో నిర్మించిన బ్రాహ్మణ సదనాలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని అన్నారు.ఖమ్మం భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.