హైదరాబాద్ : రాష్ట్రంలోని గీత కార్మికుల సంక్షేమం కోసం రూ. 100 కోట్లతో ప్రత్యేక పథకాన్ని ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టబోతున్నదని ఆర్థిక మంత్రి హరీశ్రావు తన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు. గౌడన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. చెట్లకు పన్ను వసూలు చేసే విధానానికి తెలంగాణ ప్రభుత్వం స్వస్తి చెప్పిందని గుర్తు చేశారు. అంతేకాకుండా రూ. 7.98 కోట్ల బకాయిలను రద్దు చేసిందని తెలిపారు. గీత కార్మికులకు సైతం ఆసరా పెన్షన్లు అందిస్తున్నామని చెప్పారు. గీతకార్మికులు మరణిస్తే పరిహారం కింద రూ. 5 లక్షలు ఇస్తున్నామని పేర్కొన్నారు. గతంలో శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి రూ. 50 వేలు మాత్రమే పరిహారం లభించేది. తెలంగాణ ప్రభుత్వం ఆ పరిహారాన్ని రూ. 5 లక్షలకు పెంచిందని గుర్తు చేశారు.
గౌడ సోదరులకు మద్యం దుకాణాల్లో 15 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్రప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. ఈ రిజర్వేషన్ల ద్వారా 393 మద్యం దుకాణాలు రాష్ట్రంలోని గౌడసోదరులకు లభించాయి. తద్వారా 2963 మంది లబ్దిపొందారని గుర్తు చేశారు. నీరా ఉత్పత్తి, సేకరణ కోసం రూ. 20 కోట్లను ప్రభుత్వం కేటాయించిందన్నారు. భువనగిరి సమీపంలోని నందనంలో నీరా ప్రాసెసింగ్ యూనిట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. నెక్లెస్ రోడ్డులో నిర్మిస్తున్న నీరా కేఫ్ను ప్రభుత్వం త్వరలోనే ప్రారంభించనుందని మంత్రి హరీశ్రావు తెలిపారు.