హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఈ యేటి గణేశ్ నవరాత్రోత్సవాల్లో మీ మండపంలో పర్యావరణ హిత విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారా? అయితే, మీరు రూ.10 వేలు గెలుచుకునే అవకాశం ఉంది. ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఈ ఏడాది సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎకో ఫ్రెండ్లీ వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించినవారిని, పర్యావరణానికి హాని కలుగకుండా ఉత్సవాలు నిర్వహించేవారిని ప్రోత్సహించేందుకు నగదు బహుమతి అందించనున్నది. పర్యావరణ హిత వినాయకుడి విగ్రహారాధనపై ఆన్లైన్ క్విజ్ సైతం నిర్వహిస్తున్నది.
ఈ విషయాలను పీసీబీ సభ్య కార్యదర్శి ఎస్ కృష్ణఆదిత్య వెల్లడించారు. శుక్రవారం సనత్నగర్లోని పీసీబీ కార్యాలయంలో ఆయన పోటీల పోస్టర్ను ఆవిష్కరించి, మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రూ.10 లక్షల వరకు నగదు బహుమతులతోపాటు 8-12 ఇంచుల ఎత్తయిన 2 లక్షల మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో పీసీబీ చీఫ్ ఇంజినీరింగ్ బీ రఘు, జేసీఈఎస్ సత్యనారాయణ, నగేశ్, శ్రీనివాస్రెడ్డి, గంగాధర్, డబ్ల్యూడీ ప్రసన్నకుమార్, దాసరి ప్రసాద్ పాల్గొన్నారు.