హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): సీనియర్ ఐఏఎస్ అధికారికే నాసిరకమైన షూస్ అంటగట్టిన అంపిల్ టెక్నాలజీస్ సంస్థకు వినియోగదారుల కమిషన్-1 రూ.10 వేల జరిమానా విధించింది. కొనుగోలుదారు చెల్లించిన మొత్తాన్ని ఆరు శాతం వడ్డీతో 45 రోజుల్లోపు తిరిగి అందజేయాలని ఆదేశించింది. అసలేం జరిగిందంటే.. సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రస్తుత సీఎస్ శాంతికుమారి అంపిల్ టెక్నాలజీస్ నుంచి వాకింగ్ షూను 2022 ఏప్రిల్ 6న రూ.14,999 చెల్లించి కొనుగోలు చేశారు. వాకింగ్లో ఎలాంటి అవాంతరాలు ఉండవని, అన్ని సీజన్లలో నడవడానికి అనుకూలంగా, దీర్ఘకాలిక మన్నిక ఉంటుందని కంపెనీ హామీ ఇచ్చింది. కొన్న కొన్ని రోజులకే షూ ముందు భాగంలో రంధ్రాలు కనిపించాయి.
వెంటనే అంపిల్ టెక్నాలజీస్కు సమాచారమిచ్చారు. ప్రొడక్ట్ను రీప్లేస్ చేస్తామని, కొత్త షూను అందజేస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. కానీ, పలుమార్లు కొనుగోలుదారు తరఫున కోరినా కంపెనీ నుంచి ఎలాంటి స్పందన లేకపోయింది. తన విలువైన సమయం వృథా కావడంతోపాటు ఇబ్బందులు, వేదనకు గురయ్యామని, తమకు న్యాయం చేయాల్సిందిగా ఆమె వినియోగదారుల కమిషన్ను అభ్యర్థించారు. ఫిర్యాదుదారు తరఫున న్యాయవాది రాతపూర్వక, మౌఖికంగా వాదనలు వినిపించారు. నిజానిజాలను, ప్రాడక్టు స్థితిని నమోదు చేశారు. ఫిర్యాదుదారు వస్తువు సేవా లోపంతోపాటు అన్యాయమైన వ్యాపార ధోరణిని బెంచ్ ముందు నిరూపించారు. కొనుగోలుదారుకు రూ.14,999 మొత్తాన్ని 6 శాతం వడ్డీతో కలిపి రిఫండ్ చేయడంతోపాటు కంపెనీకి రూ.10 వేలు జరిమానా విధించింది. రూ.5 వేలు కోర్టు ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశించింది. తీర్పు కాపీ అందిన 45 రోజుల్లోపు ఆదేశాలు అమలు చేయాలని పేర్కొన్నది.