హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): అక్రమంగా సేకరించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల నుంచి వేలిముద్రలను క్లోనింగ్ చేయడం ద్వారా బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్న ఓ ముఠా పోలీసులకు పట్టుబడింది. మొత్తం 9 మంది సభ్యులతో కూడిన ఈ ముఠాలో ఆరుగురిని సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వారిలో కీలక సూత్రధారి అసాధారణ్ అలియాస్ రూపేశ్, ఫినో పేమెంట్స్ బ్యాంక్ బిజినెస్ కరస్పాండెంట్ కే శ్రీనుతోపాటు ఉదయ్కిరణ్, మహ్మద్ అయాస్, నరేంద్ర, శివకృష్ణ అనే వ్యక్తులు ఉన్నారు.
రఫీ, యువరాజ్, తరుణ్ అనే మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని హైదరాబాద్ జేసీపీ (క్రైమ్స్) గజారావు భూపాల్ బుధవారం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. నిందితులు ఖమ్మంలోని ఈ-సేవ కేంద్రం నుంచి 2,500 ల్యాండ్ రిజిస్ట్రేషన్ పత్రాలను డౌన్లోడ్ చేసి ఫింగర్ ప్రింట్స్ను సేకరించారని, వాటి ద్వారా వెయ్యి ఫింగర్ ప్రింట్స్ను క్లోనింగ్ చేశారని వివరించారు. వాటిని పీఓఎస్ (పాయింట్ ఆప్ సేల్) మిషన్లో ఉపయోగించి దాదాపు రూ.10 లక్షలు కాజేసినట్టు తెలిపారు. అందులో రూ.5 లక్షలు స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించామని, మిగిలిన సొమ్ము కోసం ఆరా తీస్తున్నామని చెప్పారు. సమావేశంలో సైబర్క్రైమ్స్ డీసీపీ కవిత, ఏసీపీ శివమారుతి పాల్గొన్నారు.