హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): ‘ముఖ్యమంత్రి, మంత్రులు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. వారికి మా సమస్యలు చెప్పుకుందామన్నా.. మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు’ అని యువజన కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి తీసుకురావడం కోసం క్షేత్రస్థాయిలో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చిన తమకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎలా? అని వాపోయారు. తమకు గుర్తింపు లభిస్తుందన్న నమ్మకం కలుగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ఏవిధంగా కష్టపడగలమని ప్రశ్నించారు. గాం ధీభవన్లో బుధవారం యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చినా తమకు గుర్తింపు రావడం లేదని కొందరు కార్యవర్గ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా.. వర్కింగ్ ప్రెసిడెంట్లు జగ్గారెడ్డి, మహేశ్కుమార్గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ బుజ్జగించే ప్రయత్నం చేశారు.
గతంలో మాదిరిగా కలవడం కష్టమే!
‘పార్టీ అధికారంలోకి వచ్చి 50 రోజులే అయింది. మీకు గుర్తింపు రావడానికి కొంత సమయం పడుతుంది. అప్పటి దాకా ఓపిక పట్టండి’ అని జగ్గారెడ్డి సూచించారు. అధికారంలోకి వచ్చాక మునుపటి మాదిరిగా కలువడం కష్టమేనని జగ్గారెడ్డి నచ్చజెప్పే ప్రయ త్నం చేశారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపైనే సీఎం, మంత్రులు ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారని, అనుబంధ సంఘాలకు నామినేటెడ్ పోస్టుల విషయంలో కొంత జాప్యం జరుగుతున్న మాట వాస్తవమేనని జగ్గారెడ్డి తెలిపారు. ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ జోక్యం చేసుకుంటూ.. యువజన కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ తమ ప్రతిపాదనలతో నివేదిక ఇస్తే దానిని సీఎం, అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరుగడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.