నర్సంపేట, మార్చి 30: చిన్ననాటి స్నేహితుడని సాయం కోరిన ఓ మహిళ.. అతడి చేతిలోనే హత్యకు గురైంది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మైసంపల్లిలో జరిగిన ఈ హత్య ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు కేసు మిస్టరీని ఛేదించగా.. వరంగల్ డీసీపీ రవీందర్ శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. మైసంపల్లికి చెందిన వెంగళ సుప్రియ (27)కు భర్త రాజ్కిరణ్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజ్కిరణ్ హనుమకొండలో ఓ ఎలక్ట్రానిక్ షాపులో పనిచేస్తున్నాడు. సుప్రియ ములుగులో చదువుతున్నప్పుడు శశికాంత్తో పరిచయమేర్పడి స్నేహితుడయ్యాడు. ప్రస్తుతం సుప్రియ అనారోగ్యానికి గురైంది. మెరుగైన చికిత్స చేయించుకునేందుకు దవాఖానల సమాచారం కోసం హైదరాబాద్లో ఉన్న శశికాంత్కు ఫోన్ చేసి వివరాలు అడిగింది. ప్రస్తుతం శశికాంత్ స్విగ్గీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడు ములుగు జిల్లా జగ్గన్నపేట పరిధి సారంపల్లికి చెందిన అజ్మీరా శిరీషతో సహజీవనం చేస్తున్నాడు. సుప్రియ ఫోన్ చేసిన విషయాన్ని శశికాంత్ శిరీషకు చెప్పాడు. కోపోద్రిక్తురాలైన శిరీష శశికాంత్ను తీసుకొని హైదరాబాద్ నుంచి బైక్పై మైసంపల్లికి వచ్చింది. తాను శశికాంత్తో సహజీవనం చేస్తున్నానని, ఆయనకు మరోసారి ఫోన్ చేయొద్దని సుప్రియకు వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయింది. అదే సమయంలో సుప్రియ మెడలో ఉన్న బంగారంపై శిరీష కన్నుపడింది. దాన్ని కాజేసేందుకు సుప్రియను హత్య చేయాలని శశికాంత్, శిరీష పథకం పన్నారు. ప్లాన్లో భాగంగా.. వారు మరోసారి మైసంపల్లికి వచ్చారు. అప్పుడు సుప్రియ ఇంట్లో లేకపోవడంతో వెళ్లిపోయారు. తిరిగి ఈ నెల 23న మధ్యాహ్నం ఎవరూ లేని సమయంలో సుప్రియ వద్దకు వచ్చారు. వంట గదిలో ఉన్న సుప్రియను వెనుక నుంచి శిరీష గట్టిగా పట్టుకోగా.. శశికాంత్ గొంతు నులిమి చంపేశాడు. చనిపోయాక ఆమెను మంచంపై పడుకోబెట్టి.. ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను తీసుకొని బైక్పై హైదరాబాద్కు పరారయ్యారు. మిగిలిన వస్తువులను అమ్ముకోవడానికి ఖానాపురం మండలంలో తెలిసిన వారి ఇంటికి వస్తుండగా పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నారు. పోలీసులను చూసి పారిపోతుండగా వెంబడించి పట్టుకొని విచారణ చేస్తే నేరం ఒప్పుకున్నారు. దీంతో శశికాంత్, శిరీషను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బంగారు ఆభరణలు, బైక్, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు డీసీపీ వెల్లడించారు.