నిర్మల్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ఇటీవలి వరదలతో అతలాకుతలమైన కడెం ప్రాజెక్టును ఇరిగేషన్ శాఖ అధికారులు సమష్టిగా శ్రమించి పూర్వస్థితికి తెచ్చారు. వరదలతో ప్రాజెక్టు గేట్లు పూర్తిగా దెబ్బతిని, ఎత్తిన గేట్లు కిందకి దిగకపోవటంతో నీరంతా గోదావరి పాలైంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా వరద నీరు ప్రాజెక్టు గేట్లపై నుంచి ప్రవహించటంతో ఆనకట్ట తెగిపోతుందని అందరూ భావించారు. మొత్తం 18 గేట్లకుగాను 17 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలినా నీరు గేట్ల పైనుంచి వెళ్లింది. దీంతో గేట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
వీటికి మరమ్మతులు చేసేందుకు రెండుమూడు నెలలు పట్టవచ్చని భావించిన ఇరిగేషన్ అధికారులు, ప్రాజెక్టు ఆయకట్టు రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 68 వేల ఎకరాల ఆయకట్టు రైతులు వానకాలం పంటపై దాదాపు ఆశలు వదులుకొన్నారు. అయితే అధికారులు యుద్ధ ప్రాతిపదికన గేట్లకు మరమ్మతులు పూర్తి చేసి మొత్తం 18 గేట్లను కిందికి దింపారు. దీంతో గరిష్ఠ నీటి మట్టం 7.06 టీఎంసీలకుగాను ప్రాజెక్టులో ప్రస్తుతం 5 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
గేట్ల ట్రయల్ రన్ సక్సెస్
ప్రాజెక్టు గేట్ల మరమ్మతులను ఇరిగేషన్ అధికారులు సవాల్గా తీసుకొని 15 రోజుల్లోనే పూర్తి చేశారు. కౌంటర్ వెయిటర్లకు కూడా మరమ్మతులు పూర్తి కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ మరమ్మతుల కోసం హైదరాబాద్కు చెందిన 16మందితో కూడిన ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగంలో నిష్ణాతులైన టెక్నికల్ బృందాన్ని రంగంలోకి దింపారు.
వారు రాత్రింబవళ్లు శ్రమించి గేట్లకు ఆధునిక పద్ధతుల్లో మరమ్మతులు పూర్తి చేశారు. ట్రయల్ రన్ను సైతం పూర్తి చేశారు. టెక్నికల్ బృందం సమక్షంలోనే పలుమార్లు గేట్లను పైకి ఎత్తి, కిందికి దింపి పరిశీలించారు. గేట్ల మరమ్మత్తులు పూర్తి కావడంతో కుడి, ఎడమ కాలువలకు సాగునీరు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఎడమ కాలువ కింద 58 వేల ఎకరాలు, కుడి కాలువ కింద 2 వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. వచ్చే వారం, పది రోజుల్లో నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రాజెక్టు కింద ఉన్న 90కి పైగా చెరువులను నింపేందుకు కూడా చర్యలు చేపట్టారు.