హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యావిధానం పేరుతో విద్యను కార్పొరేటీకరణ, కాషాయీకరణ చేయడానికి ప్రయత్నిస్తున్నదని ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షుడు తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. హైదరాబాద్లోని డాక్టర్ రాజ్బహదూర్ గౌడ్ హాల్లో బుధవారం ఏఐఎస్ఎఫ్ రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. దేశంలో విద్యారంగం నేడు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నదని, విద్యారంగాన్ని కాపాడలేని నిస్సహాయస్థితిలో పాలకవర్గాలు ఉన్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిషరించకుండా జాతీయ విద్యా విధానం పేరిట వినాశనానికి తెరతీస్తున్నదని ఆరోపించారు.
ప్రభు త్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసి పేద, మధ్యతరగతి వర్గాలకు విద్యను దూరం చేసే కుట్రకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు విద్యార్థిలోకం కలిసి రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్టా లక్ష్మణ్. రాష్ట్ర ఆఫీస్ బేరర్లు ఇటికాల రామకృష్ణ, కాసోజు నాగజ్యోతి, గ్యార నరేశ్, రఘురాం, గ్యార క్రాంతి, ప్రవీణ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.