యాదాద్రి, సెప్టెంబర్ 20 : యాదగిరిగుట్ట క్షేత్రానికి 2014 నుంచి ఇప్పటి వరకు వివిధ రూపాల్లో దాతల ద్వారా రూ.90 కోట్ల మేర విరాళాలు అందినట్టు ఆలయ ఈవో ఎన్ గీత తెలిపారు. ఇందులో స్వామివారి విమాన గోపురం స్వర్ణతాపడం, స్వామివారి బంగారు ఆభరణాలు, బంగారు, వెండి కలశాలు, గర్భాలయ ద్వారం, ధ్వజస్తంభానికి బంగారు తొడుగులతోపాటు నగదు, అన్నదానం కార్యక్రమానికి, లక్ష్మీ సదనం, కాటేజీ నిర్మాణం, అతిథి గృహ నిర్మాణం, కూలర్లు, ఆర్వోఆర్ ప్లాంట్లు, స్వామివారి బంగారు బావి, బంగారు పుష్పా లు, బంగారు పీటల రూపంలో భక్తులు స్వా మివారికి సమర్పించినట్టు ఆమె వివరించారు. ప్రధానాలయ విమాన గోపురం స్వర్ణతాపడానికి గత ఏడాది సెప్టెంబర్ 25 నుంచి సోమవారం నాటికి రూ.20 కోట్ల నగదు, 7 కిలోల బంగారం కూడా ఇందులో భాగమేనన్నారు.
గుట్టలో డిసెంబర్ 4న కోటి పుష్పార్చన
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యక్షేత్రంలో డిసెంబర్ 4న స్వామివారికి కోటి పుష్పార్చన కార్యక్రమం నిర్వహిస్తామని ఈవో ఎన్ గీత మంగళవారం తెలిపారు. దేవస్థాన చరిత్రలో తొలిసారిగా జరిగే ఈ వేడుకను అత్యంత వైభవంగా జరుపుతామన్నారు.
సంగీత భవన్లో కల్యాణ మండపం
యాదగిరిగుట్టపైన బాలాలయ ప్రాం తంలో నిర్మించే సంగీత భవన్లో స్వామివారి నిత్య తిరుకల్యాణోత్సవం జరిపే కల్యాణ మండపాన్ని కట్టనున్నారు. ఏకకాలంలో వెయ్యి జంటలు కల్యాణంలో కూర్చునే విధంగా చర్యలు తీసుకోనున్నారు. ప్రధానాలయ పునర్నిర్మాణం అనంతరం స్వామి, అమ్మవార్ల కల్యాణం ప్రాకార మండపాలలో జరుపుతున్నారు. రాబోయే రోజుల్లో భక్తుల రద్దీ పెరగనున్న నేపథ్యంలో కల్యాణ మండపాన్ని విస్తరింపజేస్తామని ఈవో గీత తెలిపారు.