దేశంలోని ప్రతి భూమి/ప్లాటుకు ఆధార్ తరహా ప్రత్యేక నంబర్
కోర్టు, బ్యాంకు రికార్డులతో భూమి పత్రాల అనుసంధానం
పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదికలో వెల్లడి
పౌరులకు మెరుగైన సేవలందించేందుకేనంటున్న కేంద్రం
న్యూఢిల్లీ, మార్చి 29: దేశంలోని ప్రతి భూమి/ప్లాటుకు ఏడాదిలోగా ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఆధార్ నంబర్ లాగానే భూములకు కూడా 14 అంకెల ప్రత్యేక నంబర్ను కేటాయించనున్నారు. భూమి రికార్డుల డాటా బేస్ను ఆ తరువాత రెవెన్యూ కోర్టు రికార్డులతో, బ్యాంకు రికార్డులతో అనుసంధానం చేయనున్నారు. అనంతరం లబ్ధిదారుల ఇష్టాయిష్టాలను బట్టి వారి ఆధార్ నంబర్ను కూడా దీనికి అనుసంధానించనున్నారు. గ్రామీణాభివృద్ధిపై ఏర్పాటుచేసిన పార్లమెంటరీ స్థాయీ సంఘం గత వారం లోక్సభకు సమర్పించిన నివేదికలో ఈ విషయం వెల్లడించింది.
డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మాడర్నైజేషన్ ప్రోగ్రామ్ (డీఐఎల్ఆర్ఎంపీ)లో భాగంగా ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. కేంద్రం డీఐఎల్ఆర్ఎంపీని 2008లో ప్రారంభించింది. ఈ పథకం వచ్చేవారంతో ముగియాల్సి ఉండగా, మరోమారు 2023-24 వరకు పొడిగించింది. భూములు /ప్లాట్లకు కేటాయించే ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ‘యూనిక్ ల్యాండ్ పార్సెల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (యూఎల్పీఐఎన్/అల్పిన్) అని పేర్కొంటున్నారు. ఈ ప్రక్రియను ఇప్పటికే పది రాష్ర్టాలలో ప్రారంభించారని, వచ్చే మార్చి నాటికి దేశమంతా చేపట్టనున్నారని భూ వనరుల విభాగం తమకు తెలిపిందని పార్లమెంటరీ స్థాయీ సంఘం తన నివేదికలో పేర్కొంది.
భూ కుంభకోణాలను నివారించేందుకే ఈ ప్రత్యేక గుర్తింపు నంబర్ను ఇస్తున్నామని, ఇది ఒకరకంగా భూములకు ఆధార్ నంబర్ వంటిదని భూ వనరుల విభాగం అధికారి ఒకరు తెలిపారు. అల్పిన్ పథకాన్ని గత బుధవారమే ఒడిశాలో ప్రారంభించామని చెప్పారు. భూమి రేఖాంశం, అక్షాంశాల సమన్వయం ఆధారంగా, ఇదివరకే ఉన్న సమగ్ర సర్వే నివేదికల ఆధారంగా నంబర్ను కేటాయిస్తామని తెలిపారు. 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో పది రాష్ర్టాల్లో అల్పిన్ పథకాన్ని చేపట్టాలని ప్రతిపాదించినట్టు పార్లమెంటరీ కమిటీ తెలిపింది. భూమి రికార్డులను అల్పిన్ ద్వారా ఆధార్తో అనుసంధానం చేయడానికి ఒక్కోదానికి రూ.3 వరకు ఖర్చవుతుందని భూ వనరుల విభాగం తెలిపింది. భూ యజమానులు స్వచ్ఛందంగా కోరితేనే వారి భూమి రికార్డులను వారి ఆధార్తో అనుసంధానం చేస్తామని పేర్కొంది.
భూమి రికార్డులకు సంబంధించి ప్రతి జిల్లాలో ఒక అధునాతన కార్యాలయాన్ని నెలకొల్పడానికి రూ.50 లక్షల వరకు ఖర్చవుతుందని భావిస్తున్నారు. ఇక రెవెన్యూ కోర్టు యాజమాన్య వ్యవస్థతో భూమి రికార్డులను అనుసంధానం చేయడానికి రూ.270 కోట్ల వరకు వ్యయం కాగలదని అంచనా వేస్తున్నారు. డీఐఎల్ఆర్ఎంపీ తదుపరి దశలో భూమి రికార్డుల డాటా బేస్ను బ్యాంకులతో అనుసంధానం చేయనున్నారు. ఈ ప్రక్రియ అంతా పౌరులకు మెరుగైన సేవలందించేందుకేనని భూ వనరుల విభాగం తెలిపింది.