భద్రాచలం, మార్చి 25: హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో సోమవారం డోలోత్సవం, వసంతోత్సవాలను నేత్రపర్వంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులకు పంచామృతాలతో ప్రత్యేక స్నపనం చేపట్టారు. ఏప్రిల్ 17న శ్రీరామ నవమిని పురస్కరించుకొని స్వామివారి కల్యాణంలో వినియోగించే తలంబ్రాల తయారీకి సంప్రదాయబద్ధంగా శ్రీకారం చుట్టారు. వేదపండితుల మంత్రాల నడుమ అలంకరించిన బంగారు ఊయలలో స్వామివారిని ఆశీనులను చేసి డోలోత్సవం జరిపారు.
హోలీ పౌర్ణమిని పురస్కరించుకొని స్వామివారికి వసంతోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. తొలుత అంతరాలయంలోని మూలవరులకు, లక్ష్మీతాయారమ్మ వారికి, ఆంజనేయస్వామికి వసంతాన్ని చల్లి.. తర్వాత భక్తులపై చిలకరించారు. సాయంత్రం స్వామివారికి తిరువీధి సేవ జరిపారు. మిథిలా ప్రాంగణం ఎదురుగా ఉన్న ఉత్తర ద్వారం వద్ద ప్రత్యేక వేదికపై ఉత్సవమూర్తులను ఆశీనులను చేసి రోలు, రోకళ్లకు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి కల్యాణంలో పాల్గొనే ఆచార్య, బ్రహ్మరుత్వికుల రోళ్లలో పసుపు కొమ్ములు వేసి దంచగా.. తర్వాత వారి భార్యలు రోళ్లలో పసుపు కొమ్ములు వేసి దంచారు. ఆ తర్వాత పసుపు, కుంకుమ, నెయ్యి, బుక్కా గులాల్, అత్తరు, పన్నీరు తదితర సుగంధ ద్రవ్యాలతో తలంబ్రాలను కలిపే వేడుకలను నయనానందకరంగా నిర్వహించారు.