హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని మోదీ సర్కారు ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నదని, ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నదని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ మండిపడ్డారు. ఏకపక్షంగా విద్యుత్తు సవరణ బిల్లును తీసుకురావడమే కాకుండా.. చట్టం కాకముందే దాన్ని అమలుచేసేందుకు సిద్ధపడుతున్నదని విమర్శించారు. ఈ బిల్లును టీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని పునరుద్ఘాటించారు. విద్యుత్తు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ.. బిజిలీ క్రాంతి యాత్రలో భాగంగా శుక్రవారం పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నేతలు హైదరాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్లో సదస్సు నిర్వహించారు. తొలుత మింట్కాంపౌండ్ నుంచి ఖైరతాబాద్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం జరిగిన సదస్సుకు వినోద్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రం తీరుతో కరెంటు చార్జీలు భారీగా పెరుగుతాయన్నారు.
ఉచిత విద్యుత్తు.. సబ్సిడీలు.. పింఛన్లు వంటి పథకాలను ఉచితాలంటూ కేంద్రం అపహాస్యం చేయడంపై వినోద్కుమార్ మండిపడ్డారు. దేశానికి తిండిపెట్టే రైతులకు ఉచిత విద్యుత్తునిస్తే తప్పా? అని ప్రశ్నించారు. ఉచిత విద్యుత్తు ఇవ్వకుంటే.. సబ్సిడీలు బంద్చేస్తే.. అంతా వ్యవసాయం మానేస్తే.. దేశం పరిస్థితి ఏం కావాలని, పట్టణాల్లో ఉన్న ప్రజలకు తిండి ఎవరు పెడతారని నిలదీశారు.
కేంద్రం విద్యుత్తుతో రాజకీయం చేయాలని చూడటం సరికాదని ఏఐపీఈఎఫ్ అధ్యక్షుడు శైలేంద్ర దూబే హెచ్చరించారు. విద్యుత్తు వ్యవస్థలను టాటాలు, అదానీలకిస్తే తెలంగాణ తరహాలో వారు రైతులకు ఉచిత విద్యుత్తు ఇస్తారా? అని ప్రశ్నించారు. కేంద్ర నిర్ణయంతో డిస్కంలు ప్రైవేటుపరం కావడమే కాకుండా, ఆస్తులను సైతం అప్పనంగా అప్పగించే కుట్రదాగి ఉన్నదని ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ సెక్రటరీ జనరల్ మోహన్శర్మ పేర్కొన్నారు. సదస్సులో ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ పవర్ డిప్లొమా ఇంజినీర్స్ సెక్రటరీ జనరల్ అభిమన్యు ధన్కర్, జేఏసీ కన్వీనర్ రత్నాకర్రావు తదితరులు పాల్గొన్నారు.