హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): మహిళా సంఘాల సభ్యులు పెద్ద వ్యాపారాలు చేయాలని, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో వ్యాపారాల ఏర్పాటుకు ముందుకురావాలని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. సోమవారం రంగారెడ్డి జడ్పీ కార్యాలయంలో స్త్రీనిధి ద్వారా మండల, పట్టణ సమాఖ్యలు, నైబర్హుడ్ సెంటర్లకు కంప్యూటర్లను పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. పెరుగుతున్న టెక్నాలజీని వినియోగించుకొని అవకాశాలు మరింతగా మెరుగుపర్చుకోవాలని సూచించారు. వ్యాపారాలు, ఎంటర్ప్రైజెస్ను పెంచాలని చెప్పారు. మహిళాసంఘాలకు ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో రుణాలను అందిస్తున్నదని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ ఏడాది స్త్రీనిధి ద్వారానే రూ.3వేల కోట్ల రుణాలు ఇవ్వనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్రెడ్డి, స్త్రీనిధి పరపతి సహకార సమాఖ్య అధ్యక్షురాలు ఇందిరా, సెర్ప్ డైరెక్టర్ నర్సింహారెడ్డి, స్త్రీనిధి డైరెక్టర్ రాజారావు పాల్గొన్నారు.