సొరేన్ సర్కారును కూల్చేందుకు గత ఆగస్టు 5నే బీజేపీ ముహూర్తం
‘ఇప్పటికే పలు రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చాం. మరో నాలుగు రాష్ర్టాలు తెలంగాణ, ఢిల్లీ, ఏపీ, రాజస్థాన్ సర్కారులను కూల్చబోతున్నాం’ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కోసం బీజేపీ బ్రోకర్లు జరిపిన బేరసారాల ‘డర్టీ డీల్స్’ వీడియోలోని ఓ సంభాషణ ఇది. అయితే, బీజేపీ బ్రోకర్లు చెప్పినట్టు నాలుగు కాదు.. ఐదు రాష్ర్టాలను కూల్చాలని కమలదళం తొలుత కుట్రపన్నింది. అవును.. తెలంగాణ కంటే ముందు జార్ఖండ్లోని హేమంత్ సొరేన్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ విఫలయత్నం చేసినట్టు తాజాగా తేలింది. దీనికోసం, విపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బీజేపీ డబ్బు ఎర వేసింది. ఈ గుట్టును బెంగాల్ పోలీసులు రట్టు చేశారు. ఈ ఘటనను పక్క రాష్ట్రంలో డబ్బు పట్టుబడిన కేసుగానే అందరూ చూశారు. అయితే, బీజేపీ బ్రోకర్ల బేరసారాల ఉదంతాన్ని వీడియో తీసి, వారి కుట్రలను తెలంగాణ సర్కారు పకడ్బందీగా బట్టబయలు చేసింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రాజకీయ దివాళాకోరుతనానికి దిగిన బీజేపీని యావత్తు దేశప్రజల ముందు నగ్నంగా నిలబెట్టింది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో):
హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి జార్ఖండ్లోని హేమంత్ సొరేన్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ.. గత ఆగస్టులోనే ‘మనీ గేమ్’ ఆడినట్టు తాజాగా తేలింది. దీని కోసం అక్కడి సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు ఆశజూపి, ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకునేలా కమల నేతలు ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే, బెంగాల్ పోలీసుల మెరుపు దాడితో ఈ కుట్ర భగ్నమైంది. ఈ మేరకు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) జాతీయ ప్రతినిధి సాకేత్ గోఖలే శుక్రవారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
‘మహా’ను కూల్చగానే.. నెక్స్ టార్గెట్గా జార్ఖండ్
81 అసెంబ్లీ స్థానాలు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీకి 2019 డిసెంబర్లో ఎన్నికలు జరిగాయి. హేమంత్ సొరేన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)కు ఎన్నికల్లో 30 సీట్లు దక్కగా, బీజేపీకి 25, కాంగ్రెస్కు 16 సీట్లు లభించాయి. ఆర్జేడీ, సీపీఐఎంఎల్, ఎన్సీపీకి తలా ఒక్క సీటు లభించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన కనీస మెజారిటీ 41 సీట్లు. దీంతో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐఎంఎల్, ఎన్సీపీ కలిసి మహాఘట్బంధన్గా ఏర్పడి సొరేన్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే, విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడమే పనిగా పెట్టుకొన్న బీజేపీ.. మహారాష్ట్రలో ఉద్ధవ్ సర్కారును కూల్చగానే జార్ఖండ్ను తదుపరి లక్ష్యంగా చేసుకొన్నది. ఒకవైపు, కేంద్ర దర్యాప్తు సంస్థలతో సొరేన్ను ప్రత్యక్షంగా టార్గెట్ చేసిన బీజేపీ.. మరోవైపు, సంకీర్ణ ప్రభుత్వంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు డబ్బుల ఎర వేయడం ప్రారంభించింది. ఈ ఏడాది జూలైలో ఈ కుట్రకు తెరతీసింది.
బిశ్వశర్మ నేతృత్వంలో..
సొరేన్ ప్రభుత్వాన్ని కూల్చడంలో భాగంగా జార్ఖండ్కు చెందిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇర్ఫాన్ అన్సారీ, రాజేశ్ కచ్చప్, నామన్ బిక్సల్ కొంగరీని బీజేపీ నేతలు ట్రాప్లోకి లాగారు. సొరేన్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తే, ఒక్కొక్కరికి రూ. 10 కోట్లు చొప్పున చెల్లిస్తామని ఆఫర్ ఇచ్చారు. మరికొంత మంది ఎమ్మెల్యేలను పట్టుకురావాలని ఉసిగొల్పారు. అస్సాం సీఎం, బీజేపీ నాయకుడు హిమంత బిశ్వశర్మ పర్యవేక్షణలో బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త సిద్ధార్థ్ మజుందార్, అస్సాంకు చెందిన మరో వ్యాపారవేత్త అశోక్ ధనుకతో ముగ్గురు ఎమ్మెల్యేలకు గత జూలైలో ఈ బేరసారాలు జరిగాయి. సదరు ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. అస్సాంకు రహస్యంగా వెళ్లి రెండు, మూడుసార్లు బిశ్వశర్మను కూడా కలిసినట్టు సమాచారం.
ఆగస్టు 5న కూల్చివేతకు ముహూర్తం
ఎమ్మెల్యేలతో బేరసారాలు ముగిశాయి. ఆగస్టు 5న సొరేన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ముహూర్తం నిర్ణయించారు. అడ్వాన్స్గా ఇచ్చిన డబ్బుతో అస్సాం నుంచి బెంగాల్ మీదుగా జార్ఖండ్కు కారులో వెళ్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగాల్ పోలీసులు జూలై 30న హౌరాలో పట్టుకొన్నారు. దీంతో కుట్ర బయటపడింది. సొరేన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు తమ సహచర ఎమ్మెల్యేలకు బిశ్వశర్మ డబ్బు ఆఫర్ చేశారని మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనూప్ సింగ్ ఆరోపించారు. ఈ ఆరోపణలను బీజేపీ నేతలు ఖండించకపోగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బిశ్వశర్మతో బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చారని అస్సాం మంత్రి పీయూష్ హజారికా వ్యాఖ్యానించడం గమనార్హం. జార్ఖండ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఒక్కో ఎమ్మెల్యేకు బీజేపీ రూ. 10 కోట్లు ఆఫర్ చేసిందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. సొరేన్ ప్రభుత్వం కూలిపోకుండా తమ పోలీసులు కాపాడారని పేర్కొన్నారు.
తెలంగాణపై బీజేపీ కుట్రలు
సీఎం కేసీఆర్ విడుదల చేసిన వీడియోలు షాక్కి గురిచేశాయి. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ యత్నించిందనడానికి ఇదే సాక్ష్యం. జార్ఖండ్ సర్కారును కూడా ఇలాగే బీజేపీ కూల్చడానికి ప్రయత్నిస్తే, బెంగాల్ పోలీసులు ఆ కుట్రను భగ్నం చేశారు. ఇప్పుడు బీజేపీ ఆ మురికి వ్యూహాలను తెలంగాణపై ప్రయోగించాలనుకొంటున్నది. ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే.
-టీఎంసీ జాతీయ ప్రతినిధి సాకేత్ గోఖలే.